Pages

Thursday, August 16, 2012

మంచి అలవాట్లు

  • అమ్మకి చిన్న చిన్న పనులలో సాయంచేయటం
  • అసత్యం ఆడకూడదు
  • ఆకలిగొన్న వానికి అన్నము పెట్టుము
  • ఆటలాడుచోట, అలుక పూనరాదు
  • ఆడిన మాట తప్పరాదు
  • ఆడుకున్న తరువాత ఆట వస్తువులను సర్దుకోవాలి
  • ఇంటి పని (హోం వర్క్) అయిన తర్వాతనే ఆడుకోవాలి
  • ఇంటి పని (హోం వర్క్) సరిగ్గా చేయటం
  • ఇంటికి వచ్చిన వారిని గౌరవించటం
  • ఇంటిలోకి వచ్చే ముందు కాళ్ళు శుభ్రంగా తుడుచుకొని రావాలి
  • ఉపాధ్యాయులను గౌరవించటం
  • ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు, మంచి మాటలు నేర్చుకోవటం
  • ఎల్లప్పుడూ దైవచింతన చేయుము
  • ఏదైన తిన్న తరువాత కాగితాలను, తొక్కలను చెత్తకుండీలో (Dust Bin) వేయాలి
  • ఒకరి మీద చాడీలు చెప్పరాదు
  • కరెంటు వైర్లతో, స్విచ్చులతో, ప్లగ్గులతో ఆడకూడదు
  • ఖాళీ సమయాల్లో బొమ్మలు గీయటం, చిన్న చిన్న కథలు చదవటం వంటివి చేయటం
  • గురువుల మాట వినాలి
  • గ్యాస్ పొయ్యితో (బర్నర్‌తో) ఆడకూడదు
  • చక్కగా తల దువ్వు కోవటం
  • చెడ్డవారి చెలిమి చేయరాదు
  • చేసిన మేలు మరువరాదు
  • జీవహింస చేయరాదు
  • టి వి చూసేటప్పుడు టి వి కి దగ్గరగా కూర్చోవద్దు
  • తనను తాను పొగడు కొనరాదు
  • తల్లిదండ్రులను కష్ట పెట్టరాదు
  • తిన్న వెంటనే పళ్ళు తోముకోవటం
  • తొందరపడి ఏ పనీ చేయరాదు
  • నమ్మిన వారిని మోసం చేయరాదు
  • నిప్పుతో లేక అగ్గిపుల్లలతో ఆడకూడదు
  • నీళ్ళు పట్టు కోవటం అయిన వెంటనే పంపు కట్టేయాలి
  • నీళ్ళు వృధా చేయవద్దు
  • నోరు మంచిదయితే, ఊరు మంచిదవుతుంది
  • పరనింద పనికిరాదు
  • పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవటం
  • పుస్తకాలను చక్కగా సర్దుకోవాలి
  • పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు లేచి నిలబడటం
  • పెద్దల మాటలు వినవలెను
  • పెద్దలను గౌరవించాలి
  • పేదల మీద దయ ఉంచవలెను
  • బడికి వెళ్ళటానికి పది నిమిషాల ముందే కావలసినవన్ని సంచిలో (Bag) సర్దుకోవాలి
  • బడికి వెళ్ళేటప్పుడు బూట్లను శుభ్రంగా తుడుచుకొని బూట్లను వేసుకోవాలి
  • బీదలను చూసి హేళన చేయవద్దు
  • బూట్లను శుభ్రంగా ఉంచుకోవాలి
  • భోజనం చేసే ముందు చేతులు కడుక్కోవటం
  • భోజనం చేసే ముందు వస్తువులను (గిన్నెలను) తీసుకురావటానికి అమ్మకు సాయం చేయటం
  • మంచి అలవాట్లకు మించిన ధనం లేదు
  • మంచిని మించిన గుణం లేదు
  • మనిషికి మాటే అలంకారం
  • మాట వెండి, మౌనం బంగారం
  • రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవాలి
  • లేచిన వెంటనే పక్క బట్టలు తీయటం
  • విద్య చెప్పిన వారిని మరువరాదు
  • వేకువ(తెల్లవారు) జామునే లేవటం
  • వేళకు బడికి (స్కూల్‌కి) వెళ్ళటం
  • శుభ్రంగా క్రింద పడకుండా పలహారం(టిఫిన్) తినటం
  • శుభ్రంగా పళ్ళు తోముకోవటం
  • శుభ్రమైన బట్టలు ధరించటం
  • సజ్జనులతో స్నేహము చేయవలెను
  • సాటి విధ్యార్ధితో స్నేహ భావంతో మెలగటం
  • స్వామి యందు భక్తి నుంచుము

హంస - వేటగాడు

నీచబుద్ధి గల స్నేహితుడి వల్ల మనకు ఆపదలు వస్తాయి. సాయం చేసే గుణం ఉన్న వాళ్ళని చూసి ఓర్చుకోలేని వాళ్ళు తమకు తెలియకుండానే ఇతరులకు హాని చేస్తారు. అలాంటి వారితో స్నేహం ఎప్పటికైనా ప్రమాదాన్ని తెస్తుంది. అలాంటి స్నేహితుడి వల్ల ప్రాణాలను పోగొట్టుకున్న హంసకథ తెలుసుకుందాం. మహేంద్రపురంని ఆనుకుని ఉన్న అడవిలో ఓ హంస, పావురం ఎంతో స్నేహంగా ఉండేవి. హంస పున్నమినాటి చంద్రునిలా తెల్లగా నిండుగా ఉండేది. దానికి చేతనయినంతవరకు ఇతర పక్షులకు సాయంచేస్తూ ఆనందంగా జీవించేది. పావురం మాత్రం పక్షుల జాతిలో ఉత్తమజాతికి చెందిన హంస తనకి స్నేహితుడని, తను మంచివాడు కావటం వల్లనే ఆ హంస తనతో స్నేహం చేసిందని తన జాతి పక్షుల ముందు గర్వంగా గొప్పలు చెప్పుకునేది.

మహేంద్రపురంలో ఉండే వల్లభుడు అనే వేటగాడు ఒక రోజు వేటకోసం అడవికి వచ్చాడు. మిట్ట మధ్యాహ్నం వరకు వెతికినా వాడికి ఒక్క జంతువు కూడా దొరకలేదు. ఇవ్వాళ్ళ పొద్దున్నే లేచి ఎవరి మొహం చూసానో గానీ అడవంతా బోసిపోయినట్లుగా ఉంది అనుకుంటూ ఎండవేడికి తట్టుకోలేక దగ్గరలో ఉన్న ఓ చెట్టు క్రిందకు చేరి తన దురదృష్టానికి చింతించసాగాడు. ఆ చెట్టు మీద నిద్రపోతున్న హంస క్రింద అలికిడికి నిద్రలేచి చూసింది. చెమట నిండిన శరిరంతో ఉస్సూరుమంటూ చెట్టు క్రింద కూర్చన్న వేటగాడు కనిపించాడు దానికి. వాడిని చూడగానే ఆ హంసకు జాలి కలిగింది. అలసటతో ఉన్న వేటగాడికి కాసేపు సేద తీర్చుదాం అనుకుంటూ తన పొడవైన రెక్కను విసనకర్రలా మార్చి వాడికి గాలి విసరసాగింది. ఆ చల్లని గాలికి అలసటతో ఉన్న వేటగాడికి నిద్ర వచ్చి ఆ చెట్టు క్రిందే పడుకుండిపోయాడు.

అదే సమయంలో అక్కడకి వచ్చిన పావురం హంస చేస్తున్న పని చూసి, నీది ఎంత జాలి మనసు, మనల్ని చంపటానికి వచ్చిన వేటగాడికి కష్టపడి గాలి విసురుతున్నావు. ఇలాంటి పాపాత్ముడికి సేవలు చేయటానికి నీకు సిగ్గుగా లేదు అంది. దానికి హంస మిత్రమా! పరోపకారం మిదం శరీరం అన్నారు పెద్దలు. ఎదుటి వ్యక్తి ఎలాంటి వాడైనా మనకు చేతనయినంత సాయం చెయ్యాలి అంది. చెయ్యి! చెయ్యి బాగా సాయం చెయ్యి! అంటూ పావురం ఎగతాళిగా నవ్వూతూ సరిగ్గా ఆ వేటగాడి మొహం మీద పడేలా రెట్ట వేసి తుర్రుమంటూ ఎగిరిపోయింది. ఆ రెట్ట సూటిగాపోయి వేటగాడి ముక్కు మీద పడటంతో వాడు కోపంగా కళ్ళుతెరచి తల పైకెత్తి చెట్టు మీదకు చూసాడు. వాడికి రెక్కలను చాపి ఉన్న హంస కనిపించింది. వెంటనే బాణం అందుకుని గురిచూసి హంసను కొట్టాడు. అది సూటిగా పోయి హంస డొక్కల్లొ గుచ్చుకుని దాని ప్రాణాలను తీసీంది.

నీచబుద్ధి కల పావురం చేసిన పనికి పరోపకార బుద్ది కల హంస తన ప్రాణాలను పోగొట్టుకుంది కనుక నీచబుద్ధి కలవారితో స్నేహం చెయ్యటం ప్రమాదం అన్న సంగతి తెలుసుకోవాలి.

స్వార్ధం తెచ్చిన అనర్ధం

గ్రామాధికారి పరంధామయ్యకు సుస్తీచేసి మంచాన పడ్డాడు. ఒకరోజు ఆయన తన ముగ్గురు కొడుకుల్నీ పిలిచి "ఒరేయ్ అబ్బాయిలూ, ఇక నేను ఎంతోకాలం బతుకుతానని నమ్మకం లేదు. కాబట్టి నా దగ్గరున్న డబ్బు, బంగారం, పొలం మీకు పంపకం చెయ్యాలనుకుంటున్నాను. మీకు ఎవరెవరికి ఏమి కావాలో నిర్ణయించుకుని నాకు చెప్పండి" అన్నాడు.

వెంటనే మూడో కొడుకు సుందరం భార్య, భర్తను గదిలోకి పిలిచి, "చూడండీ! మీరు బంగారం తీసుకోండి. అది పాతకాలం బంగారం. మేలైన రకం, ఎప్పటికైనా మంచి ధర పలుకుతుంది" అని చెప్పింది. సుందరం భార్య మాటకు ఎదురు చెప్పలేక, "అలాగే" అని తల ఊపుతూ, తండ్రి దగ్గర కెళ్లి తనకు బంగారం కావాలనుకున్నాడు.

రెండో కొడుకు గోపాలం భార్య కూడా భర్తను లోపలికి పిలిచి "ఏమండోయ్! మీరు డబ్బు తీసుకోండి. ఎంచక్కా మనం పట్నం వెళ్లి ఏదైనా వ్యాపారం చేసి పెద్ద ధనవంతులం కావచ్చు. మంచి బంగళా కొనుక్కోవచ్చు. ఈ పల్లెటూర్లో నేను ఉండలేను బాబూ. అయినా ఆ చవుడు భూమి మనకేందుకు, ఎంతకాలం కష్టపడితే అంతడబ్బు సంపాదించగలం" అంది. గోపాలం కూడా భార్య మాటకు తల ఊపుతూ "అలాగే" అంటూ వెళ్లి, తండ్రితో తనకు డబ్బు కావాలన్నాడు.

పాపం అమాయకుడైన కామేశం తన వాటాగా మిగిలిన బంజరు పొలాన్ని తీసుకుని భార్యాభర్తలిద్దరూ అహొరాత్రులూ కష్టపడి, దాన్ని మంచి వ్యవసాయ భూమిగా చేసుకుని చక్కని పంటలు పండించుకున్నారు. కొద్దికాలానికే పరంధామయ్య కాలం చేశాడు.

డబ్బు తీసుకుని పట్నం వెళ్లిన గోపాలం వ్యాపారం ప్రారంభించాడు. కొద్దిరోజులకే వ్యాపారంలో నష్టం రావడం మొదలైంది. వాళ్ల సలహా, వీళ్ల సలహా విని, ఉన్న డబ్బంతా వ్యాపారంలో పెట్టాడు. అనుభవం లేనందువల్ల బాగా మోసపోయి దివాలా తీశాడు.

భార్యను తీసుకుని సుందరం పట్నంలో కాపురం పెట్టాడు. సుందరం భార్యకు బంగారమంటే మహా మోజు, రోజుకొక నగ సింగారించుకొని, ఇరుగు పొరుగు ఇళ్లకు వెళ్లి గొప్పగా ప్రదర్శించేది. ఇదంతా బాగా గమనించిన దొంగలు ఒకరోజు అర్థరాత్రి సుందరం ఇంట్లో జొరబడి, కత్తులు చూపి బెదిరించి, ఉన్న బంగారమంతా దోచుకెళ్లారు. ఇద్దరూ లబోదిబోమని ఏడుస్తుంటే ఇరుగుపొరుగు వచ్చి ఓదార్చారు.

సుందరం, గోపాలం ఇద్దరూ బతుకు తెరువు లేక అన్న దగ్గరకొచ్చి బావురమన్నారు. భార్యల మాటలు విని, బంజరు భూమిని అన్నకు అంటగట్టి, మోసం చేసి, తమ స్వార్ధం తాము చూసుకున్నందుకు తగినశాస్తి జరిగిందని ఇద్దరూ పశ్చాత్తాప పడ్డారు. సిగ్గుతో తలవంచుకుని అన్నకు క్షమాపణ చెప్పుకున్నారు. ముగ్గురూ కలిసి వ్యవసాయం చేసుకుంటూ కలిసిమెలిసి జీవించారు. తోబుట్టువును మోసం చేసినందుకు ఏం జరిగిందో చూశారా బాలలూ! ఇతరులను ఎప్పుడూ మోసం చెయ్యకూడదు.       

స్వామీజీ - సొమ్ములు

ఆ మండలంలో అదే పెద్ద ఊరు. పూర్తిగా పట్టణం అనలేం, అలాగని పల్లెటూరు కాదు. మధ్యస్తంగా ఉంటుంది. ఆ ఊరిలో హైస్కూలు ఉంది, లైబ్రరీ ఉంది, రెండు మూడు ఆఫీసులూ వున్నాయి. భాస్కర్ పంచాయితీ ఆఫీసు గుమస్తా. ఆయన దగ్గర తెలుసుకోదగ్గ విశేషాలేమీ లేవు గానీ, అతని భార్య శారద గురించి మాత్రం వివరంగానే చెప్పుకోవాలి. మంచి భక్తిగలది. ముఖ్యమైన దేవాలయాల్లో నిత్యం పూజలు, అభిషేకాలు చేయిస్తూ వుంటుంది. పిల్లలలో ఎవరికి జబ్బు చేసినా తాను ఉపవాసాలుంటుంది. ప్రతి శుక్రవారం పేదలకు పైసలు పంచుతుంది. కాషాయ రంగు దుస్తుల్లో ఎవరు కనిపించినా మహాసాధువని గౌరవించి భక్తితో సత్కరిస్తుంది. ఏ గుడిలో భజన జరిగినా ఆవిడ ముందుంటుంది. భక్తి గీతాలు కమ్మగా పాడుతుంది. చీరలు నగలు కొనడంలో ఎంత ఖర్చయినా వెనుకాడదు. వాళ్ళాయన శ్రీపతి నెలనెలా జీతం తెచ్చి ఆమె చేతికిస్తాడు. మిగిలిన ఇంటి బాధ్యతలన్నీ ఆమెవే. శారదంటే ఆ వూళ్ళోనేకాదు చుట్టుపక్కల అమ్మలక్కలకు బాగా తెలుసు. ఆ రోజు అమావాస్య ఆదివారం, మిట్ట మధ్యాహ్నం మంచి ఎండలో వయస్సులో ఉన్న ఒకావిడొచ్చింది. "ఏమండీ మీ యింటికి గడ్డం మీసాలున్న నడివయస్సులో వున్న సాధువుగారేమయినా వచ్చినట్లు చూశారా మీరు?" అంది.

"సాధువుగారా! ఎవరూ రాలేదండీ!" కూర్చొండి అని చెప్పి ఎంతో గౌరవంగా మాట్లాడి వరండాలో కుర్చీ వేసింది శారద. ఫరవాలేదు వెళతానండి. "ఆయన్ని గురించి మీకు రెండు మాటలు చెప్పాలి" అందామె. "చెప్పండి" అంది శారద ఆతృతగా. ఆయన దేవుడు లాంటివాడు. దెయ్యాల్ని భూతాల్ని వదలగొడతాడు. మనలో మనకు తెలియని పెద్ద రోగాల గురించి ఇట్టే చెప్పేస్తాడు. ఇంటి దోషాల గురించి, మనకు సంభవించే ముప్పు గురించి ముందుగా చెప్తాడు. ఏ వ్యాపారం చేస్తే లాభసాటిగా ఉంటుందో ఎక్కడ పొలం కొంటే అధికంగా పండుతాయో చెప్తారు. మాకు, మా చుట్టాలలో కొందరికి, మరి కొందరు తెలిసిన వారికి చెప్పారు. రాబోయే ప్రమాదాల గురించి ముందుగా చెప్పి కాపాడాడని వివరాలు గడగడ చెప్పింది. ఈలోగా వస్తారేమో అటు హైస్కూలు వైపుగా వెళ్ళివస్తానండీ అని గబగబా వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన పావుగంటకి ఆయన రానేవచ్చారు. శారదకు చాలా ఆనందం కలిగింది. ఎంతో ఆదరంగా ఆయన్ని లోనికి ఆహ్వానించింది. "తల్లీ నేను మీ ఇంటికొచ్చిన కారణం ఓ ముఖ్య విషయం చెప్పి పోదామని" అన్నాడు స్వామీజీ. "చెప్పండి స్వామీ"అంది. "మీ ఆయనికి ప్రాణగండం ఉంది అదీ ఒక్క వారంలోగానే" అన్నాడు. "అమ్మో ప్రాణగండమే" అని ఆవిడ నిలువెల్లా వణికి పోయింది.

"మరేం కంగారు పడకండి దానికి శాంతి చేయాలి." "ఏం చేద్దాం చెప్పండి స్వామీ" అంది. ఇంతలో ఆమె మరలా వచ్చి మీ కోసమే వెతుకుతున్నాను స్వామి అంటూ వచ్చింది. ఆమె రాక అతనికి మరికొంత ఆనందాన్నిచ్చినట్లు కనిపించాడు. ముగ్గురు చాప మీద కూర్చున్నారు. ఇవ్వాళ అమావాస్య ఆదివారం కొద్ది నిముషాల్లో మనం కాళీ మాతకి పూజలు చేయాలి. అప్పుడుగాని ఆయనకి ప్రాణగండం తప్పదు."ఇప్పుడేంకావాలో త్వరగా చెప్పండి" స్వామీ. ముందు కర్పూరం, పటికబెల్లం, కొబ్బరికాయ తెప్పించండి మిగిలినవి ధూపదీప నైవేద్యాలు నా దగ్గరున్నాయి. అన్నారు. ఫరవాలేదు డబ్బివ్వండి నేను తెచ్చిపెడతాను" ఎంతో సహాయకారిగా అంది ఆ వచ్చినావిడ. వెంటనే శారద లోపలకెళ్ళి బీరువాలోంచి డబ్బు తెచ్చి ఇచ్చింది. ఆమె వేగంగా వెళ్ళిపోయింది. స్వామీజీ పూజకు అన్నీ సిద్దం చేస్తున్నారు. శారదని కాళ్ళూ, చేతులు, ముఖం శుభ్రంగా కడుక్కొని రమ్మన్నారు. ఆమె అలా చేసి వచ్చింది. ఈలోగా ఆమె కూడా కావలసినవి తీసుకువచ్చింది. ముగ్గురు కాళీమాత బొమ్మ దగ్గరగా కూర్చున్నారు.

స్వామీజీ మూడు నిముషాలలో మూడు నాలుగు మంత్రాలు చదివాడు. అగరొత్తులు వెలిగించాడు. మీ నగలు ఒకసారివ్వండి కాళీమాత దగ్గరుంచి ధూపం వేసి తిరిగి తీసుకుందురుగాని అన్నాడు. ఆమె తన మెడలోని నానుతాడు, చంద్రహారం, నల్లపూసలు, గొలుసు, చేతిగాజులు రెండు ఆనందంగా తీసిచ్చింది.స్వామిజీ వాటిని అందుకున్నాడు. ఓ తెల్లని గుడ్డలో చుట్టి కాళీమాత ఫొటో ముందు ఉంచాడు. ఆ తరువాత తన దగ్గరున్న సంచిలోంచి మూడు పటిక బిళ్ళల్లాంటివి తీశాడు. ఒకటి తనునోట్లో వేసుకున్నాడు. ఇంకొకటి వచ్చినావిడకి ఇచ్చాడు. మరొకటి శారదకిచ్చాడు. అమె దాన్ని కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుంది. వెంటనే స్పృహ లేకుండా పడిపోయింది. శారదకు మెలకువ వచ్చి చూసేసరికి ఏముంది! స్వామిజీ లేడు, ఆమె లేదు, నగలూ లేవు. సర్వం దోపిడీ జరిగింది. ఆ తరువాత ఏడ్పులు పెడబొబ్బలు. జనం చేరారు. తన నమ్మకం నవ్వులపాలై కన్నీళ్ళు మిగిలాయి.       

స్వశక్తి

కేశవాపురం అనే ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి రాము, సోము అనే ఇద్దరు కొడుకులు. ఇద్దరికీ పెళ్ళిళ్ళు జరిగాయి. ఇల్లు పెద్దది కావటము వలన అందరూ కలసే ఉన్నారు. రాము పెద్దవాడు. ఉదయమేలేచి పొలము పనికి వెళ్ళి తండ్రికి సాయపడుతూ ఉండేవాడు. సోము సోమరిగా ఉంటూ పగటి పనికి వెళ్ళి కలలు కంటూ కాలక్షేపము చేసేవాడు. ఎవరు చెప్పినా ఏ పని చేయక పడుకొని ఉండేవాడు. కొంతకాలము గడిచింది. ఆ ఊరికి ఒక మెజీషియన్ వచ్చాడు. అనేక విద్యలు ప్రదర్శించాడు. చివరగా ధాన్యమును బంగారముగా మార్చాడు. సోమూకి ఆశ్చర్యము కలిగింది. మెజీషియన్ ప్రదర్శన పూర్తి అయిన పిదప అతన్ని కలిసి ధాన్యము బంగారముగా మార్చే విధము చెప్పమని అడిగాడు. అంతకుముందే అతని గురించి తెలుసుకున్న మెజీషియన్ రేపు చెప్తానన్నాడు. అతని ఇంటికి వెళ్ళి ఆ రాత్రి బసచేసి మరుసటి రోజు సొంతముగా నీవు నీ భార్యా కలసి పంట పండించిన ధాన్యముతోనే ఇది సాధ్యమవుతుంది. నీకు బంగారము తయారయ్యాక నీ భార్యకి నగలు చేయించాలి సుమా! అంతేకాదు మీ ఇంట్లో అందరితో కలసి పనులు చేయాలి. పగలు నిద్రించరాదు. అని చెప్పాడు. బంగారము తయారు చెయ్యాలనే ఉద్దేశముతో తండ్రితో చెప్పి తనవాట పొలము తీసుకొని భార్య సహాయంతో కష్టపడి ఎక్కువ ధాన్యము పండించాలని కృషి చేశాడు. అతని అదృష్టము వలన పంటలు బాగా పండాయి. ధాన్యరాసులు ఇంటికి వచ్చాయి. మెజీషియన్ కొరకు ఎదురుచూడసాగాడు.

ఒకరోజున మెజీషియన్ వచ్చాడు. అందరికీ సహాయపడుతూ ఉన్న సోమూని చూసి ఆనందించి నీ భార్యకి నగలు చేయించావా? అని అడిగాడు. ఆమె ముసిముసి నవ్వులు నవ్వసాగింది. మీరు మాకు బంగారము తయారుచేయిస్తానన్నారుకదా! అని అమాయకంగా అడిగాడు. ధాన్యపు బస్తాలను చూపుతూ ఇవి బంగారము కాదా! అన్నాడు. అప్పుడు ఆ వస్తువు చూసి ధాన్యము ఒక ప్రక్క, బంగారము వలెనున్న ఇత్తడి ముక్క ఒక ప్రక్క చూపించి నవ్వుతూ నీ గురించి విని, నీ పగటికలలకు స్వస్తి చెప్పాలనే, నాచెల్లెలు కాపురం ఆనందంగా ఉండాలనే ఈ ఎత్తువేశాను. నేను నీకు బావని. మీ పెళ్ళికి రాలేకపోయాను. ఫ్రెండ్స్ సహకారంతో ఈ నాటకం ఆడాను. మాచెల్లెలు నన్ను గుర్తించింది. నీకు చెప్పవద్దని ప్రమాణం చేయించుకున్నా. మీ అన్నయ్య ద్వారా నీ విషయము తెలుసుకొని అందరికీ నీవు బాగుపడటమే ఆనందమని తెలిసి మౌనం వహించారు అని చెప్పాడు. ఆ రోజు అందరూ కలిసి చలోక్తులతో మాట్లాడుకున్నారు. అన్న గారితో పొలము పనులలో సహాయము చేస్తూ సుఖసంతోషాలతో గడిపాడు.       

స్వర్గానికి దారి

ఇంతకుముందు ఎన్నో అద్భుతాలు, ఇంద్రజాల విద్యలు ప్రదర్శించానని చెప్పుకుంటున్న ఒక సాధువు ఒక గ్రామానికి చేరుకున్నాడు. అతని గురించి విన్న గ్రామస్ధులు ఎంతో ఆనందంతో ఆయనకు సేవలు చేయసాగారు. రోజూ ఉదయం, సాయంత్రం అతని గుడారం వద్దకు చేరి పంచభక్ష్య పరమాన్నాలు, పట్టుపీతాంబరాలు సమర్పించేవారు. అలా కొంతకాలం గడిచింది. ఈ సంగతి ఆ నోట పొక్కి చివరకు తెనాలి రామలింగడి చెవిని చేరింది.

ఇందులో ఏదో మర్మముందని గ్రహించిన రామలింగడు సాధువు గుడారం వద్ద ఉండగా అతని వద్దకు వెళ్లి కూర్చున్నాడు. సాధువు శ్లోకాలు చదవడం మొదలెట్టాడు. ఒకటే శ్లోకం మరల చదవడంతో రామలింగడికి అనుమానం బలపడింది. రామలింగడు సాధువు నిజమైన భక్తుడు కాదని, ఆయనకు ఎలాంటి విద్యలు రావని గ్రహించాడు.

హఠాత్తుగా రామలింగడు సాధువు వైపునకు వంగి అతని గడ్డంలో నుండి ఒక వెంట్రుకను తుంచాడు. అంతే వేగంగా బయటకు పరిగెత్తి "నాకు స్వర్గానికి వెళ్లే దారి దొరికింది" అని బిగ్గరగా అరవడం మొదలెట్టడు. గ్రామస్ధులంతా నివ్వెరపోతూ చూస్తుండిపోయారు.

"ఈ సాధువు ఎంతో మహనీయుడు. ఆయన గడ్డం లోని ఒక వెంట్రుకను నా దగ్గర ఉంచుకుంటే నేను బతికున్నంత కాలం సిరిసంపదలతోనూ, చనిపోయిన తర్వాత స్వర్గంలోనూ తుల్తూతానని చెప్పాడు" అని గ్రామస్ధులతో అన్నాడు రామలింగడు. అంతే గ్రామస్ధులంతా ఒక్కసారిగా సాధువుపైన బడి సాధువు గడ్డం వెంట్రుకలను రక్తం వచ్చేలాగా తుంచసాగారు. సాధువు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకు జీవుడా అంటూ పరుగులంకించుకున్నాడు.       

స్నేహబలం

హిరణ్యకుడు అను ఎలుక, చిత్రాంగుడు అనే జింక, మంథరుడు అనే తాబేలు, లఘుపతకము అనే కాకి వీళ్ళు నలుగురు మిత్రులు. కర్పూర గౌరవము అనే చెరువులో తాబేలు ఉండేది. ఆ చెరువులో ఒడ్డున ఉన్న చెట్టు తొర్రలో ఎలుక, ఆ చెట్టు మీద కాకి ఉండేది. ఆ ప్రక్కనే ఉన్న పొదలో జింక ఉండేది.

సాయంత్రపు పూట ఈ నలుగురు మిత్రులు ఒకేచోట చేరి సరదాగా కబుర్లు చెప్పుకొంటూ ఆనందంగా జీవిస్తూ ఉండేవారు. ఒక రోజు మథ్యాహ్నమనగా ఆహారం కోసం వెళ్ళిన జింక సాయంత్రం అవుతున్నా తిరిగి రాకపోవటంతో తాబేలు, ఎలుక, కాకి కంగారు పడ్డాయి. చాలా సేపు ఎదురుచూసినా జింక వస్తున్న జాడ కనిపించలేదు.

'స్నేహితులారా! చిత్రాంగుడు ఇంతసేపయినా ఇంటికి తిరిగి రాలేదంటే ఏదో ప్రమాదంలో చిక్కుకొని ఉంటాడు అంది తాబేలు కంగారుగా. 'అవును నిజమే!' అన్నాయి ఎలుక, కాకి. 'ఇప్పుడు ఏం చేద్దాం!' అనుకున్నాయి ఆ మూడు. స్నేహితులారా! నేను ఎగిరివెళ్ళి అడవంతా చూసివస్తాను' అంటూ కాకి రివ్వుమంటూ ఆకాశంలోకి ఎగిరింది.

తాబేలు, ఎలుక చిత్రాంగుడు వస్తాడేమోనని నాలుగు దిక్కులు చూస్తూ నిల్చున్నారు. ఆకాశంలో ఎగురుతున్న కాకికి ఒకచోట జింక కనిపించిది. కాని అది వేటగాడు పన్నిన వలలో చిక్కికుపొయి బాధతో గింజుకుంటోంది. కాకి జింక ముందు వాలింది. కాకిని చూసి జింక ఆనందంతో 'వచ్చావా! లఘుపతనకము ఆహారం కోసం వచ్చి చూసుకోకుండా వేటగాడు పన్నిన వలలో చిక్కుకుపోయాను నన్ను రక్షించవా' అంది. 'భయపడకు చిత్రాంగా! నేను మన ఎలుక మిత్రుడు హిరణ్యకుడిని తీసుకువస్తాను అతను ఈ వలను కొరికి నిన్ను రక్షిస్తాడు!' అని కాకి జింకకు ధైర్యం చెప్పి మళ్ళీ ఆకాశంలోకి వేగంగా ఎగిరి వెళ్ళి కొద్దిసేపట్లోనే ఎలుకను తన వీపు మీద ఎక్కించుకొని వచ్చి జింక దగ్గర వాలింది.

ఎలుక తన పదునైన పళ్ళతో వల కొరికి జింకను విడిపించింది. ఆ ముగ్గురు ఆనందంగా కబుర్లు చెప్పుకొంటూ తమ ఇళ్ళ వైపు నడిచారు. దారిలో వాళ్ళకి తాబేలు ఎదురుపడింది. అయ్యో! మంధరా నువ్వెందుకు వచ్చావు అనడిగాడు హిరణ్యకుడు. 'చిత్రాంగుడు ఆపదలో ఉన్నాడని తెలిసి ప్రశాతంగా కూర్చోలేకపోయాను.

మీరిద్దరూ చిత్రాంగుడిని రక్షిస్తారని నాకు తెలుసు. అయినా మనసు ఊరుకోలేదు. అందుకే వచ్చాను అంటూ సమాధానమిచ్చాడు మంథరుడు. 'నువ్వు నిజమైన స్నేహితుడివీ అంటూ చిత్రాంగుడు ఆనందంగా మంథరుడిని ముద్దు పెట్టుకున్నాడు. ఆ నలుగురూ అనందంగా కబుర్లు చెప్పుకొంటూ ఇంటి దారి పట్టారు. కొంతదూరం ఆ నలుగురు నడిచే సరికి వేటగాడు ఎదురుపడ్డాడు. వాడిని చూడగానే జింక పొదలోకి దూరిపోయింది. కాకి ప్రక్కనే ఉన్న చెట్టు మీదకి ఎగిరిపోయింది, ఎలుక ప్రక్కనే ఉన్నకలుగులోకి దూరిపోయింది. తాబేలు మాత్రం ఎటూ పారిపోలేక వేటగాడి చేతికి దొరికిపోయింది.

జింక తప్పించుకున్నా తాబేలు దొరికిందని ఆనందపడ్డ వేటగాడు తాబేలును బాణం కొసకి తాడుతో కట్టి భుజం మీద వేసుకొని ఇంటి దారిపట్టాడు. వేటగాడు కొంతదూరం వెళ్ళగానే జింక, ఎలుక, కాకి ఒక్కచోట చేరి 'అయ్యో! చిత్రాంగుడు వేటగాడి బారి నుంచి తప్పించుకున్నాడంటే మళ్ళీ మంథరుడు వీడి చేతికి దొరికాడే' అనుకుని బాధపడ్డాయి.

అప్పుడు హిరణ్యకుడు 'స్నేహితులారా! మన మంథరుడిని రక్షించుకుంటానికి నాకు ఒక మంచి ఉపాయం తట్టింది అంది. 'హిరణ్యకా! తొందరగా ఆ ఉపాయం చెప్పు అంది కాకి. 'వేటగాడు నడిచే దారిలో చిత్రాంగుడు చచ్చినట్లు పడి ఉంటాడు. అప్పుడు వేటగాడు పట్టుకుంటానికి మంథరుడిని కట్టిన బాణం క్రింద పెట్టి వెళతాడు. అప్పుడు ఆ తాడును నేను కొరికి మంథరుడిని తప్పిస్తాను' అని చెప్పింది.

ఆ ఉపాయం ఎలుకకి, కాకికి నచ్చింది. ఆ మూడు అడ్డదారిలో వేటగాడి కంటే ముందుకి పోయి ఒక చోట జింక దారికి అడ్డంగా పడుకొంది. కాకి దాని మీద వాలి ముక్కుతో పొడుస్తున్నట్లు నటించసాగింది. ఆ దారిలో నెమ్మదిగా వస్తున్న వేటగాడు జింకను చూసాడు. దాని మీద వాలి కాకి ముక్కుతో పొడవటం వల్ల అది చచ్చిపోయిందనుకొని 'ఆహా! ఏమి నా భాగ్యం. ఈ రోజు అదృష్టం నా పక్షాన ఉంది అందుకే వలలో జింక తప్పించుకున్నా ఇక్కడ మరొక జింక దిరికింది అని ఆనందపడుతూ భుజం మీద బరువుగా ఉన్న తాబేలును నేల మీద పెట్టి జింక దగ్గరకు నడిచాడు.

వెంటనే ఎలుక వచ్చి తాబేలుకి కట్టిన తాడును కొరికేసింది. కాకి 'కావ్! కావ్'మని అరుస్తూ ఆకాశంలోకి ఎగిరిపోయింది. జింక పారిపోయింది. వేటగాడు కొయ్యబారి పోయి అంతలోనే తేరుకుని తాబేలు కోసం చూసాడు. అప్పటికే తాబేలు ప్రక్కనే ఉన్న చెరువులోకి పారిపోయింది.

'ఆహా! ఏమి నా దురదృష్టం చేతిలో వున్న దానిని వొదులుకున్నాను అనుకొంటూ ఆ వేటగాడు ఇంటికి వెళ్ళిపోయాడు.

ఎలుక, జింక, తాబేలు, కాకి ఆనందంగా తమ ఇంటికి వెళ్ళిపోయాయి. చూసారా! స్నేహం అంటే ఈ నాలుగు ఉన్నట్లు ఉండాలి. ఆపదలో ఉన్న స్నేహితుడిని ఆదుకుంటానికి అవసరమైతే ప్రాణాలను కూడా ఫణంగా పెట్టగలగాలి. పనికిరాని స్నేహితులు పదిమంది ఉండే కంటే అవసరంలో ఆదుకొనే స్నేహితుడు ఒక్కడుంటే చాలు. స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం.       

స్నేహ ఫలం

చ్యవన మహాముని గంగా యమునల సంగమ ప్రదేశాన నీళ్ళలో మునిగి సమాధిపరుడై తపస్సు చేస్తున్నాడు. చేపలు ఆయన శరీరమంతా ఎక్కి హాయిగా తిరగటం మొదలు పెట్టాయి. ఆయన కరుణతో వాటిని మన్నించాడు. వాటి చేష్టలకు సంతోషపడ్డాడు. అలా పన్నెండేళ్ళు గడిచిపోయాయి. ఒకసారి జాలరులు ఆ ప్రాంతానికి వచ్చి వల వేశారు. చేపలతో పాటు చ్యవనుడు కూడా ఆ వలలో చిక్కుకున్నాడు. జాలర్లు వల పైకి తీసి ఆ మహామునిని చూసి భయపడ్డారు. తప్పు క్షమించమని ఆయన కాళ్ళమీద సాష్టాంగపడ్డారు. "ఈ చేపలతో కొన్నేళ్ళుగా సహవాసం చేయడం వల్ల నాకు వాటిమీద మక్కువ ఏర్పడింది. వాటితో సహా ప్రాణాలు విడవడం కూడా ఇష్టమే నాకు! కనుక అలా చేయ్యండి. లేదా మీకో ఉపాయం చెబుతాను. ఈ చేపల్ని మీరు ఎలాగో అమ్ముకుంటారుగా! వాటితోపాటు నన్ను కూడా అమ్మెయ్యండి" అన్నాడు. జాలర్లు భయపడుతూ వెళ్ళి ఆ సంగతి నహుష మహారాజుతో చెప్పారు. ఆయన భయసంభ్రమాలతో మంత్రి, పురోహితులను వెంటబెట్టుకుని ఆ మహాముని దగ్గరకు వెళ్ళి శిరస్సు వంచి నమస్కారం చేశాడు. 'మహాత్మా! తెలియక అపరాధం చేశారు బెస్తలు. అది ఏం చేస్తే పోతుందో సెలవియ్యండి' అన్నాడు. 'మహారాజా! బెస్తలు తమ కుల ధర్మం చేశారు. అందులో వారి తప్పేముంది పాపం వాళ్ళు చాలా శ్రమపడ్డారు. అందుచేత నా శరీరానికి తగిన వెల వాళ్ళకివ్వు' అన్నాడు చ్యవన మహర్షి. ఆయన మనస్సులో కోపం లేనందుకు నహుషుడు సంతోషించాడు. మంత్రిని పిలిచి, ఈ బెస్తలకు వెయ్యి మాడలు ఇవ్వండి అన్నాడు. 'ధర్మంగా ఇవ్వు మహారాజా' అన్నాడు ముని. 'అయితే పదివేలివ్వండి' చాలదు. 'లక్ష!' న్యాయం కాదు. సరే, 'కోటి' ఉహూ. 'పోనీ నా రాజ్యంలో సగం ఇస్తాను.' 'నువ్వూ నీ మంత్రులూ ఆలోచించుకుని తగిన వెల ఇవ్వండి!' దీనికింత చర్చేమిటి' 'నా రాజ్యమంతా ఇచ్చేస్తాను.' చ్యవనుడు నవ్వుతూ సరిపోదు అన్నాడు. నహుషుడు విచార పడిపోయాడు. మంత్రులందరిని కొంచెం పక్కకు తీసుకువెళ్ళి 'ఇకేం చేద్దాం' అని ఆలోచన అడిగాడు. ఇంతలో అక్కడికి గవిజాతుడనే మహాముని వచ్చాడు. నహుషుడి సమస్యేమిటో అడిగి తెలుసుకున్నాడు. 'మహారాజా! చింత విడిచిపెట్టు, గోవులకు, విప్రులకు భేదం లేదు ఆ ఇద్దరూ హవికీ, మంత్రాలకూ ఆధారమైన వాళ్ళు. సకల వేదాలకూ ఆశ్రయుడైన మహర్షికి వెల నిర్ణయించడం దుర్లబమైన పని. బ్రాహ్మణుడితో సమానమైనదే గోవు కూడాను. కనుక గోవు నివ్వు. వెల సరిపోతుంది.' అని ఉపాయం చెప్పాడు. నహుషుడు సంతోషించాడు. చ్యవనుడి దగ్గరకు వెళ్ళి "మహాత్మా! నన్ను దయ చూడు. మీకు వెల కట్టడం ఎవరికి సాధ్యం? గోవునిస్తాను. అనుగ్రహించు అన్నాడు.
 
చ్యవనుడు సంతోషించాడు. తగిన మూల్యమే నిర్ణయించావు. అలాగే ఇవ్వు అన్నాడు. నహుషుడు గోవును జాలరులకిచ్చాడు. జాలరులు గోవుతో సహా చ్యవనుడి దగ్గరకు వెళ్ళారు. "అయ్యా! మమ్మల్ని చూసింది మొదలు మా మీద అనుగ్రహం చూపిస్తున్నావు. మమ్మల్ని కరుణించి ఈ గోవును మా దగ్గర నుంచి మీరు తిసుకోండి" అని వేడుకున్నారు. కాదనలేకపోయాడు చ్యవనుడు. "సరే అలాగే ఇవ్వండి" అని ఆ గోవును వాళ్ళ దగ్గర్నుంచి తీసుకొని, మీరూ, ఈ చేపలూ స్వర్గానికి వెళ్ళండి అని దీవించాడు. వెంటనే ఆ బెస్తలు, చేపలు కూడా శరీరాలతో ఎగసి స్వర్గానికి వెళ్ళారు. నహుషుడూ, ఆయన పరివారం అది చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడు చ్యవనుడూ, గవిజాతుడూ కలిసి నహుషుణ్ణి పిలిచి - "నీకు మేము చెరో వరం ఇస్తాం. ఏం కావాలో కోరుకో" అన్నాడు. "మీరు తృప్తిపొందడం కంటే నాకింకేం కావాలి" అన్నాడు నహుషుడు వినయంగా. "రాజా! నీకు ధర్మపరత్వం, దేవేంద్ర వైభవం కలుగుతాయి" అని దీవించి వాళ్ళిద్దరూ అంతర్హితులయ్యారు. నహుషుడు పరమానంద భరితుడయ్యాడు. "సజ్జన సాంగత్యం వల్ల ఉత్తమ ఫలితాలుంటాయని" చెబుతూ నారదుడు ధర్మరాజుకి కథ చెప్పాడు.       

స్నేహ ధర్మం

ఒకరోజు ఒక వేటగాడు అడవిలోకి వేటకు వెళ్లాడు. సాయంత్రం వరకు ఎంత ప్రయత్నించినా ఒక్క జంతువు కూడా దొరకలేదు. రాత్రవుతుండడంతో వేటగాడు గాభరా పడసాగాడు.

చెట్టుకింద కాళ్లు చాపుకుని కూర్చున్న అతనికి పక్కనే ఉన్న పొదల్లో ఒక కుందేలు తచ్చాడుతూ కనబడింది. వెంటనే వెళ్ళి చాకచక్యంగా ఆ కుందేలుని గట్టిగా ఒడిసిపట్టుకున్నాడు. ఈ రోజుకి ఈ కుందేలే తనకు ఆహారం అనుకున్నాడు.

వేటగాడి చెతుల్లో చిక్కిన కుందేలు విలవిలా తన్నుకుంటూ, "దయచేసి నన్ను వదిలేయండి. నా మిత్రులకు ఆహారం తీసువద్దామని నేను ఇక్కడకు వచ్చాను. వారికి ఆహారం ఇచ్చి తిరిగి వస్తాను. అప్పుడు నన్ను మీతో తీసుకెళ్లి, చంపి తినేయండి. ఇప్పుడు మాత్రం దయచేసి నన్ను వదిలేయండి" అని బతిమాలింది.

వేటగాడు "నేను పొద్దుటి నుంచి జంతువులకోసం వేటాడుతున్నాను. నాకు చాలా ఆకలిగా ఉంది. నీకు ప్రాణం మీద అంత తీపి, ప్రేమ ఉంటే నేను నిన్ను వదిలేస్తాను. కాని నాకు ఒక మాట నీ స్నేహితుల ఆచూకీ చెప్పు. నేను నిన్ను వదిలిపెట్టేస్తాను" అన్నాడు.

"నీకు ఆహారం కావాలి అంతే కదా! నేను నా స్నేహితుల జాడ చెప్పడం అసంభవం. నన్నే బలి తీసుకో, నీ ఆకలి తీర్చుకో. స్నేహధర్మాన్ని కాలరాయడం కంటే ప్రాణాలు త్యాగం చెయడమే ఉత్తమం. కాబట్టి నన్నే తిను" అని చెప్పింది కుందేలు.

కుందేలులో మిత్రులపట్ల ఉన్న ప్రేమను గ్రహించిన వేటగాడు, "ఆహా! ఏమి నీ మిత్రధర్మం. నీలాగే ఈ ప్రపంచంలోని మనుషులందరూ సఖ్యంగా ఉంటే ఎంత బావుండేది" అంటూ ఆ కుందేలుని విడిచిపెట్టాడు. వేటగాడికి కృతజ్ణతలు చెప్పి కుందేలు తన నివాసానికి చెంగు చెంగున గెంతుతూ వెళ్లి పోయింది.       

సోమరిపోతు

శిళ్లంగేరి అనే గ్రామంలో ఒక జమిందారుండేవాడు. అతడు చాలా ధర్మాత్ముడు. పేదవాళ్లు వచ్చి జీవనోపాధి చేసుకోవడానికి ఏ సహాయం అడిగినా లేదనేవాడుకాదు. ఒక రోజు అతని వద్దకు సోమశర్మ అనే ఒక పేదవాడొచ్చాడు. జమిందారు అతనికి పుష్కలంగా పాలునిచ్చే ఆవునిచ్చి పాలవ్యాపారం చేసుకొని జీవించమన్నాడు. సోమశర్మ జమిందారుతో "అయ్యా, తమరేమో ఆవునిచ్చారు. కానీ దానిని ఉంచడానికి మా చిన్న ఇంటిలో స్థలం లేదు." అన్నాడు. జమిందారు కొంత ధనమిచ్చి, ఆవును కట్టివేయడానికి ఒక గుడిసె వేసుకోమన్నాడు.

"అయ్యా ఆవునిచ్చారు. దానిని కట్టివేసుకోవడానికి ఒక గుడిసె వేసుకోవడానికి ధనమిచ్చారు. ఆవు ఇచ్చే పాలను అమ్మితే వచ్చే డబ్బు మాకే సరిపోతుంది. దానికి గడ్డీ దాణా ఎలా కొనను?" అన్నాడు సొమశర్మ. అందుకు జమిందారు ఆవుకు కావలసిన గడ్డీ, దాణా కూడా ఉచితంగా తానే ప్రతీరోజు తన ఇంటి నుండి పంపిస్తానన్నాడు.

రెండు రోజులు గడిచాయి. సోమశర్మ జమీందారు దగ్గరకు వచ్చి "అయ్యా నాకో ఇబ్బంది వచ్చింది. పాలు బజారుకు తీసుకెళ్లి అమ్మాలంటే కష్టంగా ఉంది. ఈ పని చేసే అలవాటు లేదు." అన్నాడు.

జమిందారు ఆ పాలను తానే కొంటానన్నాడు. మరో రెండు రోజులు గడిచాయి. ఈసారి సోమశర్మ జమిందారు వద్దకు వచ్చి, "అయ్యా ఇంత వరకు మేము భిక్షాటనతో కాలం గడిపిన వాళ్లం. ఈ ఆవుకు చాకిరీ చెయ్యడం, ఇంట్లో అన్నం వండుకోవడం మొదలైన పనులు చేయడం నా భార్యకు చాలా కష్టంగా ఉంది" అన్నాడు. జమిందారు ఆలోచించి "సరే మీకు శ్రమ లేకుండా ఒక పనిమనిషినీ, వంట మనిషినీ పంపిస్తాను" అన్నాడు.

సోమశర్మ ఇంటికి పనిమనిషి వంట మనిషి వచ్చారు. సోమశర్మకు, అతని భార్యకు చాలా సంతోషమయింది. వంట వండిపెట్టింది. భోజనం వేళకు సరిగ్గా సోమశర్మ ఇంటికి ముగ్గురు బ్రాహ్మణులు వచ్చారు. వీరు ఎందుకొచ్చారో సోమశర్మకు అర్థం కాలేదు. వాళ్లు సోమశర్మతో "శర్మగారూ, మమ్ములను జమిందారు పంపించారు. మీరు భోజనం చేయడం కూడా బద్దకం వల్ల కష్టంగా ఉంటుందని అందువల్ల ఆ పని చేయడానికి పంపించారు" అన్నారు.

సోమశర్మకు, అతని భార్యకు సిగ్గువేసింది. ఆ రోజు నుండి సోమరితనానికి స్వస్తిచెప్పి బాగా కష్టపడటం అలవాటు చేసుకొన్నారు.       

సోమరి ఋషి

టర్కీ రాజు, నస్రుపట్ల విపరీతమైన అభిమానం పెంచుకున్నాడు. నస్రు యొక్క విజ్ఞానకాంక్ష, చతురత అతడిని రాజుగారికి మరింత ప్రీతిపాత్రుడిని చేశాయి.

ఒకరోజు రాజు నస్రును పిలిచి ఇలా చెప్పాడు. "ముల్లా నస్రుద్దీన్‌, నేను నిన్ను నిజమైన విజ్ఞానం గురించి తెలుసుకోవడానికి భారతదేశానికి పంపదల్చుకున్నాను. అక్కడ చాలా మంది సాధుపుంగవులు, గురువులు వున్నారు. వారు కచ్చితంగా విజ్ఞాన సముపార్జనలో నీకు సహాయం చేస్తారు".

ఈ మాటలకు ఉప్పొంగిపోయిన నస్రు, రాజు తన ప్రయాణానికి ఆర్ధిక సహాయం చేస్తానని చెప్పడంతో మరింత సంతోషించాడు.

మధ్యమధ్యలో ఆసక్తికరమైన వ్యక్తులను కలుస్తూ, ఎన్నో రోజుల ప్రయాణం తర్వాత నస్రు భారతదేశానికి చేరుకున్నాడు. భారతదేశంలోని ఎత్తైన పర్వతాలు, దట్టమైన అడవులు, మహానదులు, అద్భుతమైన జంతు మరియు పక్షి సంపద అతడిని భారతదేశంపట్ల ఆకర్షితుడయ్యేలా చేశాయి.

భారతదేశమంతటా పర్యటించిన తర్వాత, నస్రు రుషులు, ఆధ్యాత్మిక గురువులను కలవడం మొదలుపెట్టాడు. అతడు ఎందరో నిజమైన, తెలివైన ఆధ్యాత్మిక గురువులను కలిశాడు. అలాగే తాము పుణ్యపురుషులమని ప్రజలను మోసం చేసే సోమరులనూ కలిసాడు.

ఒకరోజు ఒక అడవిలో నడుచుకుంటూ వెళుతుంటే ఒక ఋషిని కలిశాడు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఆ ఋషి ఊరి ప్రజలను వారానికోసారి తనను దర్శించాలని తనకి నచ్చిన ఆహారం తీసుకురావాలని లేదంటే వారిని శపిస్తానని హెచ్చరించాడు.

నస్రుకి ఆ ఋషి ప్రజలను మోసం చేస్తున్నాడని అర్ధమై, అతనితో తమాషా చేద్దామని అనుకున్నాడు. నస్రు ఋషి దగ్గరికెళ్ళి నిల్చున్నాడు. ఋషి కళ్ళు తెరవగానే నస్రుని చూసి, "నేను నీకు ఎలా సహాయపడగలను బాలకా?" అన్నాడు. బదులుగా నస్రు, "ఋషీ నేను దూరదేశమైన టర్కీ నుండి

నిజమైన విజ్ఞానం గురించి తెలుసుకోవడానికి వచ్చాను. మీ యొక్క విశ్వాసాలను నాకు వివరించండి." అన్నాడు.

అతనికొక అనుచరుడు దొరికాడన్న ఆనందంలో పెద్దదైన స్వరంతో ఋషి ఇలా చెప్పాడు, "జీవితం అంతం లేనిది. ఒక జన్మలో నీవు మానవుడివైతే మరో జన్మలో నీవు జంతువు లేదా మొక్కలా పుడతావు".

నస్రు ఆశ్చర్యపోయినట్లు నటిస్తూ, "అవును ఋషి ఉత్తమా! నిజంగా నేను ఒకసారి ఒక చేప వల్ల రక్షింపబడ్డాను" అన్నాడు.

"ఏంటి! ఒక చేపా! ఎలా జరిగిందది? నేను తెలుసుకోవాలనుకుంటున్నాను" పెద్దవైన కళ్ళతో, కుతూహలంతో ప్రశ్నించాడు ఋషి. ఆ ఋషికి వివిధ వ్యక్తుల నుండి కథలు సేకరించి, తన కథలుగా ప్రచారం చేయడం ఒక అలవాటు.

బదులుగా నస్రు "నేను ఒకరోజు ఒంటరిగా ప్రయాణిస్తుంటే ఒక అడవిలో తప్పిపోయాను. చాలా రోజులు నేను తిండి, నీళ్ళు లేక తిరిగాను. నేను చనిపోతానేమో అనుకునేంతలో ఒక సరస్సు నా కంటపడింది. నా శక్తినంతా కూడదీసుకుని ఆ సరస్సును చేరుకున్నాను"...

అతి కుతూహలంతో ఋషి నస్రు మాటలకు అడ్డు తగులుతూ, "ఏమయింది? చెప్పు? నువ్వు ఆ సరస్సులో పడిపోయావా? ఏదైనా అద్భుతమైన శక్తిగల చేప వచ్చి నిన్ను కాపాడిందా? చేప దేవుడిగా మారిందా?" అని అడిగాడు.

నస్రు నవ్వుతూ ఇలా అన్నాడు, "కాదు! కాదు ఋషి! నేను సరస్సు దగ్గరికెళ్ళి ఒక చేపను పట్టి, కాల్చి తిన్నాను. ఆ చేపే లేకపోతే నేను చనిపోయేవాణ్ణే కదా!"

నస్రు తనని వెర్రివాణ్ణి చేశాడని గుర్తించిన ఋషి కోపోద్రిక్తుడయ్యాడు. ఋషి స్పందించేలోగానే నస్రు అక్కడి నుండి పగలబడి నవ్వుతూ తన దారిలో తను వెళ్ళిపోయాడు.

సింహం - తోడేలు - నక్క

అనగా అనగా ఒక పెద్ద అడవి వుంది. అందులో ఎన్నో జంతువులు జీవిస్తున్నాయి. ఆ అడవిలోనే ఒక తోడేలు దాని భార్యా పిల్లలతో కలిసి వుంది. ఈ తోడేలు దాని కాపురం ఒక గుహలో పెట్టింది. అవి పగలంతా అడవిలో తిరిగి ఆహారము తినేవి. రాత్రి వేళలో గుహను చేరి విశ్రాంతి తీసుకునేవి. అలా రోజులు గడుస్తున్నాయి. వానాకాలం మొదలయింది. ఆ సంవత్సరం వానలు విపరీతంగా కురిశాయి. ఆ వానల వలన వాగులు పొంగి వరదలు వచ్చాయి. ఆ అడవి సగం నీటితో నిండిపోయింది. అందులో తోడేలు గుహ కూడా వుంది. దాని కుటుంబానికి ఆహారం దొరకటం కూడా కష్టమయింది. వాటికి ఏమి చేయటానికీ పాలుపోలేదు. అచటి నుండి అవి బయలుదేరి మంచి గుహ కోసం వెతకటం మొదలు పెట్టినాయి. తోడేలు తన భార్యతో "మనకు చాలా చెడు రోజులు వచ్చినాయి. ఆహారము లేదు సరికదా! మన పిల్లలు వానకు తడిసి పోతున్నారు. ఇపుడేమి చేద్దాం?" అని అంది. ఆడ తోడేలు చాలా తెలివిగలది. అది బాగా ఆలోచించింది. అచటకు దగ్గరలో ఒక గుహ వుంది. దానిలో ఒక సింహం వుంది. అది విశాలమైన గుహ. బాగా ఆలోచించగా ఈ విషయం ఆడ తోడేలుకు గుర్తుకు వచ్చింది. దానిలో ఎంత కాలమైనా హాయిగా వుండవచ్చు అనుకుంది. ఈ ఆలోచన మగనికి చెప్పింది. అది విని తోడేలు మండిపడింది. "వుండీ వుండీ మనమంతా సింహానికి ఆహారమవుదామా?" అంది. ఆడ తోడేలు ఒక మంచి పథకము ఆలోచించింది.

ఏమి చేయాలో వివరంగా మగ తోడేలుకు చెప్పింది. ఆ పథకానికి తోడేలు సంతోషించింది. ఆ పనికి పూనుకుంది. మగ తోడేలు,ఆడ తోడేలు వాటి పిల్లలు అన్నీ కలిసి సింహం గుహ ముందుకు చేరాయి. మగ తోడేలును, పిల్లలనూ చాటుగా వుండమంది. అచట ఒక చెట్టు చాటున అవి వున్నాయి. ఆడ తోడేలు ఒక్కటీ నెమ్మదిగా ఆ గుహద్వారము దగ్గరకు చేరింది. అచట చప్పుడు యేమీ వినపడలేదు. ఆడ తోడేలు నెమ్మదిగా గుహలోకి తొంగి చూసింది. అచట ఎవరూ కనపడలేదు. గుహ అంతా ఖాళీగా వుంది. నెమ్మదిగా గుహలోపలికి వెళ్ళి అంతా కలియ తిరిగింది. ఎటువంటి అలికిడీ లేదు. సింహం అప్పుడు గుహలో లేదు. బయటకు ఆహారము కోసం వెళ్ళింది. గుహ విశాలంగా చాలా బావుంది. సింహం ఆహారం తిని రాత్రి వేళకు వస్తుందని అర్థమైంది. తోడేలు తన భర్తనూ, పిల్లలనూ లోపలికి రమ్మని సైగ చేసింది. వారంతా లోపలికి చేరారు. పగలంతా అడవిలో తిరిగి ఆహారము తిని చీకటి పడగానే సింహం గుహకు వస్తే, ఏమి చేయాలో మగ తోడేలుకు చెప్పి గుహ బయటనే కాపలా వుంచింది. చీకటి పడసాగింది. దూరము నుంచి సింహం రావటం చూసింది. సింహం గుహకు దగ్గరగా రాగానే మగ తోడేలు గుహలోకి వెళ్ళింది.

ఆడ తోడేలు పిల్లలను గబ గబా నాలుగు దెబ్బలు కొట్టింది. అవి పెద్దగా ఏడవటం మొదలు పెట్టినాయి. మగ తోడేలు, ఆడ తోడేలు కలిసి విచిత్రంగా అరవటం మొదలు పెట్టాయి. ఆ అరుపులూ, కేకలూ వింటుంటే సింహానికి కొంచెం భయమేసింది. ఏదో పెద్ద జంతువు నా గుహలోకి చేరిందేమో అనుకుంది. అది గుహలోకి వెళ్ళకుండా బయటనే వుంది. సింహం ద్వారం వద్ద నిలబడి వుండటం చూచింది. ఆడ తోడేలు ఇలా అరవసాగింది. "పిల్లలు ఏడుస్తున్నారు. వారికి సింహం మాంసం వండి పెట్టాలట! లేకపోతే తిండి తినరట. గోల పెడుతున్నారు. ఇపుడు నేను యేమి చేసేది? ఇప్పటికిప్పుడు సింహపు మాంసం కావాలంటే ఎలా వస్తుంది? నేను ఎక్కడి నుండి తీసుకురాను." అంది. దానికి మగ తోడేలు యిలా అంది "తొందరపడకు ఒక సింహం యిటు రావటం చూశాను. అది బాగా బలిసి వుంది. దాని మాంసం బాగా రుచిగా వుంటుంది. అది యీ వైపుకి రాగానే దానిని చంపి దాని మాంసం తీసుకువస్తాను" అని గట్టిగా అరిచింది. ఈ మాటలు సింహం వింది. దానికి బాగా దడ పుట్టింది. లోపల యే జంతువులు వున్నాయో సింహానికి అర్థం కాలేదు. అవి తనను చంపుతాయేమో అనుకుంది. వెనుకకు చూడకుండా చాలా దూరం వెళ్ళింది. తోడేళ్ళ సంసారం గుహలో చేరటం అచట వుండే ఒక నక్క చూసింది. తోడేళ్ళ సంభాషణ అంతా వింది. సింహం పరుగు తీయటం చూసింది.

తోడేళ్ళ సాహసానికి నక్క ఆశ్చర్యపోయింది. తోడేళ్ళు సింహాన్ని మోసం చేసి గుహనుంచి తరమటం గమనించింది. తోడేళ్ళకి ఎలాగైనా బుద్ది చెప్పాలనుకుంది. సింహం కోసం ఆ ప్రాంతమంతా వెతికింది. అన్ని చోట్లా గాలించింది. దానికి సింహం దగ్గరలో ఎక్కడా కనపడలేదు. నక్క చాలా దూరం వెళ్ళి అంతా వెదికింది. చివరకు ఒక గుట్ట చాటున సింహం పడుకుంది. అది బాగా రొప్పుతోంది. నక్క మెల్లిగా సింహం దగ్గరకు చేరింది. ఇలా అంది. "ఓ మృగరాజా! నీవు ఈ అడవికి రాజువు. నీలాంటి వారు ఒక తోడేలుకి యిలా భయపడటం సబబేనా?నీలాంటి నాయకులు అలా పరుగు తీయవచ్చునా? రేపు యీ విషయం మిగిలిన జంతువులకి తెలిసిన నీ పరువు వుంటుందా" ఈ మాటలకి సింహం యే సమాధానం చెప్పలేదు. దానికి భయం యింకా తగ్గలేదు. నక్క మాటలు సింహం అసలు నమ్మలేదు. నక్క మరలా యిలా అంది. "ఓ రాజా! ఆ తోడేలును నీ గుహనుంచి వెళ్ళగొడతాను. నీవు నాతోరా "సింహం తనలో తాను ఇలా అనుకుంది. ఇది అసలే నక్క దీనిని అసలు నమ్మరాదు. దీనితో వెళితే ఇది నన్ను గుహ దగ్గరకు తీసుకెళ్ళి అచటనే వదలిపెడుతుంది. అపుడు నేనేం చేయాలి? ఆ జంతువుని చూసి నక్క పారిపోతే? ఇంతలో సింహానికి ఒక ఉపాయం తట్టింది. "ఓ నక్కా! నేను నిన్ను నమ్మను. నేను చెప్పింది చేస్తే నీతో రావడానికి ఒప్పుకుంటాను" అంది. నక్క అది యేమిటో చెప్పమంది. "నా తోకతో నీ తోకను ముడివేసుకొని యిద్దరం వెళదాం సరేనా" అంది. దీనికి నక్క ఒప్పుకుంది. ఆ తోడేళ్ళు యేమి చేయలేవని నక్క ఆలోచన.

సింహం, నక్క తోకలు ముడివేసుకొని గుహ వద్దకు చేరుకున్నాయి. సింహం, నక్క కలిసి రావడం ఆడతోడేలు చూసింది. నక్క యేదో ఎత్తు వేసిందని ఆడతోడేలు ఊహించింది. తోడేలు గుహముందుగా వచ్చి పక్కకు నిలబడింది. "ఏం నక్కా నేను రెండు సింహాలను తెమ్మంటే, ఒక్క దాన్నే తెచ్చావేమి? సరే ముందు నిన్ను చంపుతాను. తరువాత సింహాన్ని కూడా చంపి ఆ రెండింటినీ కలిపి వండుకు తింటాను" అని అరిచింది. ఆ మాటలు సింహం వింది. నక్క తనని మోసం చేసిందని భావించి వెనుకకు తిరిగి వేగంగా పరుగెత్తింది. ఆ పరుగులో నక్క శరీరం చీరుకుపోయింది. తోక తెగి, అది క్రిందపడి చనిపోయింది. ఇదంతా చెట్టుపైన వున్న ఒక కోతి చూచింది. నెమ్మదిగా ఆ కోతి సింహం దగ్గరకు వెళ్ళింది. నక్క చెప్పినట్లే చెప్పింది. మెల్లిగా సింహాన్ని ఒప్పించింది. సింహం కోతితో యిలా అంది "నీవు తాడుతో నా మెడకు నీ మెడకు కట్టు. అప్పుడు వెళ్ళుదాం" అంది. అలాగే చేసింది. ఆ రెండూ తాడుతో మెడలు కట్టుకున్నాయి. నెమ్మదిగా గుహ దగ్గరకు వెళ్ళినాయి. రెంటిని ఆడతోడేలు చూసింది.

ఆడతోడేలు నక్కని అరచినట్లే "ఓసీ కోతి! పొద్దుననగా సింహాన్ని తీసుకువస్తానని ఇంతరాత్రికి వస్తావా? ముందు నిన్ను చంపి, తరువాత సింహాన్ని చంపుతాను" అంది పెద్దగా. ఈ మాటతో సింహానికి వణుకు పుట్టింది. అది వెనుకకు తిరిగి పరుగులంకించుకుంది. దానితో పాటు కోతి కూడా పరుగెత్తాల్సి వచ్చింది. అవి రెండూ అలా పరుగెత్తి ఒక దిగుడు బావిలో పడి చనిపోయాయి. అందుకే పెద్దలు అంటారు "బుద్ధిబలం వుంటే బలహీనులు కూడా బలవంతులను జయించవచ్చును" అని.       

సాధువుగామారిన దొంగ

ఒక రోజు రాత్రి ధనవంతునికి చెందిన తోటలో కాయలు దొంగిలించడానికి దొంగ వచ్చాడు. తోటలోని కొన్ని కాయలు కోసాడు. ఆ అలికిడికి తోటలో నౌకర్లు లేచి దివిటీలు వెలిగించి తోటంతా వెతికారు. దొంగతనానికి వచ్చిన ఆ దొంగ పట్టుబడకుండా తప్పించుకోవాలని ఒంటికి విభూది రాసుకొని చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఒక చెట్టు కింద కూర్చొని సాధువులాగా కొంగ జపం చేయసాగాడు. నౌకర్లు దొంగను పట్టుకోలేక పోయారు. కానీ ఆ తోటలో జపం చేసుకుంటున్న ఆ సన్యాసిని చూసి వారు చాలాచాలా సంతోష పడ్డారు. మరుసటి రోజు ఆ తోటలో సాధువు బసచేసాడన్న వార్త సుడిగాలిగా ఊరిలో ప్రాకి పోయినది. చాలామంది ప్రజలు, పండ్లు, తినుబండారాలు తీసుకొని వచ్చి సాధువు కాళ్ళదగ్గర పడ్డారు. కొంతమంది అతడి పాదాల వద్ద వెండి, బంగారం, డబ్బులు కూడా పెట్టారు.

'నేను దొంగ సన్యాసిని కదా! అయినా ఎంతమంది ప్రజలు నాపట్ల భక్తిశ్రద్ధలు చూపుతున్నారు. ఎంత ఆశ్చర్యం! అని దొంగ ఆలోచించాడు. 'నేను సాధువుగా మారితే ఇంకెంతగా గౌరవిస్తారో? అని ఆలోచించి, నిజమైన సాధువు కావడానికి ఆ దొంగ తీర్మానించుకొన్నాడు. కొంతకాలానికి ఆ దొంగ నిజంగానే ఒక సాధువుగా మారి భగవంతుని కృపను పొందాడు.       

సాటివారికి సాయం

అనగా అనగా ఒక ఊరు. ఆ ఊరిలో అచ్చమ్మ అనే ఒక స్త్రీ ఉంది. ఆమెకి దేవుడు అంటే మక్కువ. పాప భీతి ఎక్కువ. ఆమె భర్త మరణించాడు. ఆమెకి ఇద్దరు కుమారులు. పెద్దవాడు రామయ్య, చిన్నవాడు అంజయ్య. ఆ ఇద్దరు పిల్లలనూ అల్లారు ముద్దుగా పెంచి పెద్ద జేసింది. ఒకసారి చిన్నవాడు అంజయ్యకి జబ్బు చేసింది. ఎన్ని మందులు వాడినా జబ్బు తగ్గలేదు. జబ్బు తగ్గితే తిరుపతి కొండకు వస్తామని మొక్కింది. శ్రీ వేంకటేశ్వర స్వామికి ముడుపు కట్టింది. ఏమైతే నేం? అంజయ్యకి జబ్బు తగ్గింది. కానీ కొండకి వెళ్ళలేదు. మొక్కు తీర్చలేదు. ఇలావుండగా ఒకనాడు దేవుని పటం ముందు ముడుపు కనిపించలేదు. కంగారు పడిపోయింది. అచ్చమ్మ "ఏరా!స్వామి ముడుపు కనిపించటం లేదు. ఏమైందిరా" అని కేకలు పెట్టింది. "నేనే తీశానమ్మా" అన్నాడు అక్కడే వున్న అంజయ్య. "అపచారం!అపచారం!ఆ ముడుపు ఎందుకు తీశావురా? అంది అచ్చమ్మ చెంపలేసుకొంటూ. "లేదమ్మా! ఆ పాతిక రూపాయలూ నారయ్యకు ఇచ్చాను" అన్నాడు అంజయ్య. "వాడికెందుకు ఇచ్చావురా? వాడికేమొచ్చిందిరా?" "ఏమొచ్చేదేమిటమ్మా! జ్వరమొచ్చింది. డబ్బు ఇస్తేగానీ మందు ఇవ్వనన్నాడు డాక్టరు. అందుకని...." అని అంజయ్య అంటూ ఉండగానే - ఎంత ఘోరం" అంటూ చిందులు తొక్కింది అచ్చమ్మ.

ఇంతలో పొలం నుంచి పెద్ద కొడుకు రామయ్య వచ్చాడు. వస్తూనే తల్లి కేకలు విన్నాడు. "ఏమిటమ్మా! ఏం జరిగింది?" అని అడిగాడు. జరిగింది అంతా చెప్పింది అచ్చమ్మ. "ఏరా అంజీ!నిజమేనా?" అని తమ్ముడ్ని అడిగాడు రామయ్య. "నిజమే అన్నయ్యా! కాని ఆ డబ్బులు నా కోసం తీసుకోలేదు. నారయ్యకి జ్వరం తగ్గటానికి మందుల కోసం ఆ డబ్బు ఖర్చు చేశాను అన్నాడు అంజయ్య. భేష్!మంచి పని చేశావురా!" అని మెచ్చుకొన్నాడు రామయ్య. "ఏమిట్రా! తప్పు అని చెప్పకపోగా నీవూ వాడినే సమర్థిస్తున్నావా?" అని ఆశ్చర్యంతో బుగ్గలు నొక్కుకుంది అచ్చమ్మ. "అవునమ్మా! చిన్నవాడు అయినా మన అంజయ్య చేసిన పని చాల గొప్పది. ఆపదలో ఉన్న మానవుని ఆదుకోవటం మానవ ధర్మం. మానవ సేవే మాధవ సేవ అన్నారు కదా!. కనుక దేవుని సొమ్ము ఖర్చు పెట్టినా తప్పు లేదు-ముప్పులేదు. "ఆపదలో ఉన్న ఒక అనాధ బాలునికి తన సొమ్ము సాయపడిందని భగవంతుడు ఆనందిస్తాడు." - అన్నాడు రామయ్య. "నిజమే బాబూ! మీరు ఇద్దరూ నా కళ్ళు తెరిపించారు. మానవ సేవే మాధవ సేవని చెప్పే వారే గాని చేసేదెవరు?" "ఒరే అంజయ్యా! వయస్సు చిన్నది అయినా నీ మనస్సు వెన్నరా." అని అంజయ్యని మెచ్చుకొంది అచ్చమ్మ.

అప్పుడే బీరువాలో నుంచి పాతిక రూపాయలు తీసుకొచ్చాడు రామయ్య. అమ్మ చేతికిచ్చి "అమ్మా! ఈ సొమ్ము తీసుకో! మళ్ళీ స్వామి వారికి ముడుపు కట్టుకో! ఇక నీ ముడుపు యధావిధిగా ఉంటుంది. నీ దడుపూ తొలగిపోతుంది!" అన్నాడు నవ్వుతూ.       

సరైన తీర్పు

ఒకసారి గంగాధరం, దశరధం అనే బాటసారులు ప్రయాణం చేస్తూ, చీకటి పడేసరికి ఒక అన్నసత్రంలో భోజనం చేసి పడుకున్నారు. వారిద్దరివీ వేర్వేరు ఊళ్లు, పరిచయస్ధులు కుడా కారు. గంగాధరం చెవులకు బంగారు పోగులున్నాయి. సత్రంలోకి వచ్చినప్పటి నుండి దశరధం దృష్టి గంగాధరం బంగారుపోగులపైనే ఉంది. ఎలాగైనా వాటిని కాజేయాలని గంగాధరంతో స్నేహం నటించి అతని పక్కనే పడుకున్నాడు దశరధం.

ప్రయాణ బడలిక వల్ల గంగాధరానికి గాఢంగా నిద్రపట్టింది. బాటసారులంతా గుర్రు పెట్టి నిద్రపోతున్న సమయంలో దశరధం, కుడి చెయ్యి తలకింద పెట్టుకుని నిద్రపోతున్న గంగాధరం ఎడమచెవిపోగును జాగ్రత్తగా కాజేశాడు. అతను ఎటూ కదలకుండా అలాగే పడి ఉండటం వల్ల కుడిచెవిపోగు కాజేయలేకపోయాడు.

తెల్లవారాక తన ముఖం చూసుకున్న గంగాధరానికి ఎడమచెవిపోగు లేకపోవడం కనిపించింది. పక్కనే ఉన్న దశరధం కుడిచెవికి తన ఎడమపోగు ఉండడం చూసి, "నీవు నా చెవి పోగు దొంగిలించావు కదా! నా చెవిపోగు నాకిచ్చేయి." అన్నాడు గంగాధరం కోపంగా. దశరధం మరింత కోపంగా, "ఏం మాట్లాడుతున్నావ్‌? నువ్వే నా చెవిపోగు తీసుకుని ఎక్కువగా మాట్లాడుతావా?" అంటూ గంగాధరం పైపైకి ఎగిరాడు.

కొంతసేపు వాదులాట తర్వాత గంగాధరం, దశరధం న్యాయాధిపతి సమక్షానికి వెళ్లారు. వాళ్లిద్దరి వాదన విన్న న్యాయాధిపతి "మీరిద్దరూ రాత్రి ఎలా పడుకున్నారో, ఇక్కడ నేలమీద అలా పడుకుని చూపించండి" అన్నాడు న్యాయాధిపతి. వారికేమి అర్ధంకాక అలాగే పడుకున్నారు. న్యాయాధిపతి వారిద్దరినీ సమీపించి పరీక్షించి చూశాడు. అంతే దొంగెవరో ఆయనకు అర్ధమైపోయింది.

వెంటనే దశరధాన్ని చూస్తూ "నీ చెవిపోగు గంగాధరం కాజేశాడన్నావుగా! అది ఏ చెవిపోగు "అడిగాడు న్యాయాధిపతి. తాను దొంగిలించిన చెవిపోగు కుడిచెవికి పెట్టుకుని ఉన్నాడు కాబట్టి గంగాధరం కాజేసింది ఎడమచెవిపోగని చెప్పాడు దశరధం. "దొంగ దొరికాడు. దశరధం! నేరం నువ్వే చేశావు. కుడి చెయ్యి తలకింద పెట్టుకుని పక్కకు తిరిగి నిద్రపోతున్న గంగాధరం ఎడమచెవిపోగు నువ్వే కాజేసి, అతనిపై నేరం మోపుతున్నావు. నిజం ఎప్పటికీ దాగదు" అని గంగాధరానికి చెవిపోగు ఇప్పించి దశరధానికి ఆరునెలల జైలుశిక్ష విధించాడు న్యాయాధిపతి.

సమయస్ఫూర్తి

ఒకప్పుడు సుజ్ఞాని అనే వర్తకుడు ఉండే వాడు అతడు తన తోటివాళ్లతో ఓ బృందంగా ఏర్పడి ఒక ఊరి నుండి మరొక ఊరికి సరుకులను తీసుకువెళ్లి అమ్ముతుండేవాడు.

ఒకసారి ఆ బృందం ఒక అరణ్యం గుండా వెళ్లవలసి వచ్చింది. అరణ్యంలోకి ప్రవేశించక ముందే సుజ్ఞాని తనవారిని పిలిచి, ఈ ఆడవిలో జాగ్రత్తగా ఉండండి. నాకు చెప్పకుండా ఇక్కడ ఏ పండూ,దుంపా, ఆకూ తినవద్దు అన్నాడు. ఆ బృందం అలా నడుస్తుండగా వారికి ఒక ఊరు కనిపించింది. ఆ ఊరికి చాలా దగ్గరలో ఒక పెద్ద చెట్టు, ఆచెట్టునిండా బోలెడు పళ్ళు కనిపించాయి. ఆ పళ్ళు చూడటానికి ఆకర్షణీయంగా, పక్వానికి వచ్చిన రుచ్చికరమైన వాటిలా అనిపించాయి. వాస్తవానికి అవి విషపు పళ్లు.

కాని విషం సంగతి తెలియకపోవడంతో వారు వాటిని తినడానికి సిద్ధమయ్యారు. వారిలో కొంత మంది తమ బృందానికి నాయకుడైన సుజ్ఞాని చెప్పాలని నిర్ణయించుకున్నారు.

కాని మరికొందరు మాత్రం తొందరపాటులో ఆ పళ్ళని కోసుకుని తినేశారు. ఇంతలో సుజ్ఞాని అక్కడకు చేరుకున్నాడు. కొద్దిసేపు ఆ చెట్టునీ, ఊరినీ పరీక్షగా చూసి, ఈ పళ్ళు తినడానికి పనికిరావు. బహుశ ఇవి విషపూరితం కావచ్చు అని చెప్పాడు.

దాంతో వాటిని అప్పటికే తిన్నవాళ్లు బలవంతంగా వాంతి చేసి ఆ పండు ప్రభావం నుండి బయటపడ్డారు.

ఊరి ప్రజలకు ఆ చెట్టువల్ల లాభం ఉంది, సుజ్ఞాని బృందంలాగే అంతకు ముందు అక్కడకి వచ్చిన వాళ్లు ఆ పళ్లును తిని చనిపొతే ఆ నవాళ్ల సామాన్లు తీసుకు పోయేవాళ్లు. ఇప్పుడు కూడా అదే విధంగా తీసుకుపోవచ్చని భావించి ఊరివాళ్లు వచ్చి, అందరూ బాగానే ఉండటం చూసి ఆశ్చర్యపోయారు.

అందులో ఒకడు ధైర్యం చేసి సుజ్ఞానిని అడిగాడు ఈ పళ్లు విషమని మీకెలా తెలిసింది?

సుజ్ఞాని చిరునవ్వు నవ్వి ఈ చెట్టు ఎక్కడానికి చాలా సులువుగా ఉంది, ఊరికి చాలా దగ్గరలో ఉంది.

అయినా చెట్టు నిండా పళ్ళున్నాయి.ఎవరూ కోయడం లేదంటే ఈ పళ్ళు మంచివి కాదనేగా అర్ధం అన్నాడు.

తమ నాయకుడి సమయస్ఫూర్తి తమ ప్రాణాలను కాపాడిందని సంతోషిస్తూ అందరూ కాపాడిందని సంతోషిస్తూ అందరూ ముందుకు సాగిపోయారు.

సత్యమేవ జయతే 2

ధర్మయ్య ఒక నిజాయితీ గల వర్తకుడు. ఒకరోజు వ్యాపార నిమ్మితం పరదేశానికి వెళ్లిన ధర్మయ్య అక్కడ సత్రంలో రంగయ్య అనే వ్యక్తితో కలిసి ఒకే గదిలో బస చేశాడు. తెల్లవారక ముందే సత్రంలో నుండి బయలుదేరిన ధర్మయ్య తన వ్యాపార లావాదేవీలను కొనసాగించేందుకు మరో పట్టణం చేరుకున్నాడు. ఆ పట్టణ పోలీసులు అతన్ని అడ్డగించి తనతో పాటు బస చేసిన రంగయ్య హత్య చేయబడ్డాడని తెలుసుకొని నిర్ఘంతపోయాడు. పోలీసులు ధర్మయ్యను ప్రశ్నిస్తూ అతని సంచి వెదకగా అందులో రక్తంతో తడిసిన కత్తి ఉండడంతో ధర్మయ్యే నేరస్ధుడని నమ్మిన పోలీసులు ధర్మయ్య ఎంతగా వాదించినా వినకుండా అతన్ని ఇరవై ఆరేళ్ళు జైలు శిక్ష విధించారు.

దీనంగా దేవుణ్ణి ప్రార్దించడం తప్ప మరేమీ చేయలేని ధర్మయ్య దేవుడి కృపకోసం ఎదురు చూడ సాగాడు. అంతలోనే కొంత మంది కొత్త నేరస్ధులను జైలులోకి తీసుకువచ్చారు అధికారులు. వారిలో కరడుగట్టిన హంతకుడు రత్నయ్య కూడా ఉన్నాడు. రత్నయ్య మాటలలో రంగయ్యను చంపింది రత్నయ్యేనని తెలుసుకున్నాడు ధర్మయ్య. కాని ప్రతీకారం తీర్చుకోవాలని చూడలేదు ధర్మయ్య.

ఒకరోజు జైలు నుండి పారిపోయేందుకు సొరంగం తవ్వుతున్న రత్నయ్యను చూశాడు ధర్మయ్య. సొరంగం తవ్వుతున్న చప్పుడు విన్న పోలీసులు వచ్చి గదిలో ఆరా తీశారు. కాని రత్నయ్యే సొరంగం తవ్వాడని ధర్మయ్య చెప్పలేదు సరికదా మౌనంగా తెలియనట్లే ఊరుకున్నాడు. తన నేరం వల్ల జైలుశిక్ష అనుభవిస్తున్న ధర్మయ్యకి తన పట్ల ఇంత దయ, ప్రేమ చూసేసరికి తట్టుకోలేకపోయినా రత్నయ్య ధర్మయ్య కాళ్లపై పడి తనను క్షమించమంటూ వేడుకోగా, "దేవుడే క్షమిస్తాడు" అంటూ అక్కడి నుండి వెళ్లిపోయాడు ధర్మయ్య.

మరుసటి రోజే తన నేరం అంగీకరించిన రత్నయ్య తన వల్ల నేరం అనుభవిస్తున్న ధర్మయ్య నిరపరాధి అని అతన్ని విడిచిపెట్టమని జైలు అధికారుబతిమాలాడు. అసలు నేరస్ధుడు దొరకడంతో ధర్మయ్యను వదిలేశారు అధికారులు.       

సత్యమేవ జయతే

బోధిసత్వుడు సేరివనే రాష్ట్రంలో సేరివ అనే పేరుతో వర్తకుడిగా ఉంటున్నాడు. అదే పేరుకల మరొక వర్తకుడితో కలసి వ్యాపారానికి బయలుదేరి ఆంధ్రపురానికి చేరుకున్నాడు. వాళ్ళిద్దరిదీ ఒకటే వ్యాపారం కనుక వారి మధ్య ఘర్షణ ఉండకుండా యిద్దరూ ఒక ఒప్పందం చేసుకున్నారు. నగర వీధులలో సగం ఒకరివి, మిగిలిన సగం వీధులు రెండో వారివి. ఒకరొక వీధికొకసారి వెళ్తే తరువాత రెండవ వారు ఆ వీధిలో తాను కూడా వ్యాపారం చేసుకోవచ్చు. ఇదీ ఒప్పందం.

ఆ పట్నంలో బతికిచెడిన వైశ్య కుంటుంబమొకటుంది. ఒకప్పుడు వారు శ్రీమంతులే. కానీ, కాలవశంలో ఆ కుటుంబంలోని వారూ వారి ఐశ్వర్యమూ నశించి ఒక ఒక అవ్వ, అమ్మాయీ మాత్రమే మిగిలారు. ఇద్దరూ కూలిచేసుకుంటూ బ్రతుకుతున్నారు. వాళ్ళింట్లో చాలాకాలం నుంచి వాడని ఒక పాత సామాగ్రి పడుండేది. సేరివ ఆ వీధిలో తిరుగుతూ దండలు కావాలా? అంటూ అరవసాగాడు. ఆ అమ్మాయి వర్తకుడి కేక విని అవ్వా! నాకేమయినా కొనిపెట్టవా? అని అడిగింది. ఆ అవ్వ బాధపడూతూ ' తల్లీ! మనకి దుర్గతి పట్టింది. నీకు నేనేమిచ్చి కొనగలను? అంది. అందుకా అమ్మాయి మనింట్లో పనికిరాని పాత్ర పడుందికదా? అంది. అవ్వ ఆ వర్తకుణ్ణి లోపలికి పిలిచి ఆ పాత్ర యిచ్చి అయ్యా ఇది తీసుకొని నీ చెల్లిలికేమయినా యివ్వు, అంది. అతను దానిని చూసి, అటూ యిటూ తిప్పి, శలాకతోగీసి, బంగారు పాత్ర అని గ్రహించి వీరికేమియు తెలిసినట్లు లేదు. ఏమియు యివ్వకుండానే దీనిని పట్టుకుపోవాలి. అనుకుంటూ "ఈ బొక్కి పాత్ర కేమి విలువ? ఇది ఎందుకూ పనికిరాదు గుడ్డిగవ్వపాటయినా చెయ్యదు". అంటూ విసిరేసి వెళ్ళిపోయాడు. కొంతసేపయ్యాక బోధిసత్వుడు కూడా ఆ వీధిలోకి వచ్చి మణికలు(దండలు)కావాలా? అంటూ కేకవేశాడు. మనుమరాలు మునుపటిలాగే అవ్వను కొనమంది.

అందుకా అవ్వ కొనడానికి మనదగ్గరేముంది? ఆ వర్తకుడు పాత్రని నేలకేసి కొట్టిపోయాడు కదా చిల్లిగవ్వకూడా చేయదని? అంది. అవ్వా! అతను దుడుకు స్వభావం కలవాడు. ఈయన యోగ్యుడిలా మంచిగా కనబడుతున్నాడు. లోపలికి పిలువనా అంది. అతన్ని పిలుచుకువచ్చి కూర్చోబెట్టి ఆ పాత్రనిచ్చింది. బోధిసత్వుడు అది బంగారు పాత్ర అని గ్రహించి " అమ్మా! ఈ పాత్ర లక్ష కార్పణములు విలువ చేస్తుంది. దీనికి తూగే వస్తువులు నా దగ్గర లేవు అనేశాడు. అవ్వ ఆశ్చర్యపోయి ఇందాక వేరొక వర్తకుడు వచ్చి యిది అర్థమాషంకూడా విలువ చేయదని నేలకేసికొట్టి పోయాడు. మీ పుణ్యం కొద్దీ యిది బంగారు పాత్రే కావచ్చును. దీనిని మీకిచ్చేస్తాను. బదులుగా మాకేమివ్వగలిగితే అదే యివ్వండి అంటూ ఆమె ఆ పాత్రను అతని చేతిలో పెట్టేసింది. బోధిసత్వుడు తనవద్ద ఉన్న 500 కార్షాణాలనీ, 500 కార్షాపణాలు విలువ చేసే వస్తువులన్నీ యిచ్చి త్రాసు, సంచి, ఎనిమిది కార్షాపణములు (రూపాయిలాంటి ద్రవ్యం) మాత్రము నన్నుంచుకోనివ్వండి అని బంగారు పాత్రని తీసుకువెళ్ళాడు.

కొంత సేపటికి రెండో వర్తకుడు వచ్చి ఆ పాత్ర యివ్వండీ. ఏదో ఒకటిస్తాను. అన్నాడు దయ తలుస్తున్నట్లు. ఆ అవ్వ అతికోపంగా లక్ష కార్షాణముల విలువచేసే పాత్రను అర్ధమాషము విలువ చేయదనిపోయావుకదా? ఒక ధర్మాత్ముడూ, న్యాయమూర్తి వచ్చి వెయ్యి కార్షాణములకు దానిని కొనుక్కువెళ్ళాడు. అని తలుపు వేసింది. అప్పుడాలోభి లక్షచేసేడి బంగారు పాత్రని అతనపహరించి నన్నెంతో నష్టపరిచాడు. అంటూ ఏడుస్తూ, నిగ్రహం కోల్పోయి పిచ్చివాడిలా తన డబ్బూ, సరుకులూ, అక్కడే పారేసి బోధిసత్వుని జాడలను బట్టి నదీతీరానికి చేరుకున్నాడు.

అప్పటికే బోధిసత్వుడు పడవ మీద వెళ్ళి పోతుండటం గమనించి పడవవాడివాడిని వెనక్కి రమ్మని అరిచాడు. బోధిసత్వుడు వొద్దు అన్నాడు. వెళ్ళిపోతున్న అతన్ని చూస్తూ రెండోవర్తకుడు దుఃఖం ఆపుకోలేక గుండెవేడెక్కి బోధిస్త్వుని మీద ద్వేషం పెచ్చు పెరగగా గుండెబరువెక్కి రక్తం కక్కుకుంటూ అక్కడేపడి చచ్చిపోయాడు. బోధిసత్వుడు తన వూరు చేరి దానాలు, పుణ్యకార్యాలుచేస్తూ జీవితం గడిపాడు.       

శ్రధ్ధ లోపించిన పూజ

ఒక ఊరిలో ఒక ధనికుడు నివసించుచుండెను. అతనికి ఆస్తిపాస్తులు కొల్లలుగా గలవు. వ్యాపారము, వ్యవసాయము రెండింటియందును అతడు ధనమును బాగుగా గడించి శ్రీమంతుడయ్యను.

రెండు మూడు పెద్ద భవనములు కూడ అతనికి కలవు. అతని ఇంటిలో ఎందరో పరిచారికులు, సేద్యగాళ్ళు, గుమస్తాలు పనిచేయుచుందురు. ఒకనాడా ధనికునకు సత్యనారాయణవ్రతము చేయవలెనని సంకల్పము కలిగినది. తదనుసారము పురోహితునతో సంప్రదించి పూజకై ఒకరోజును నిర్ణయించి, ఆపూజకు కావలసిన పదార్ధములన్నియూ రాసుకొని గుమస్తాచేత వాటిని తెప్పించెను. సరిగా ముహూర్తము వేళకు సత్యనారాయణ పటము పూజామందిరములో ప్రతిష్ఠించబడెను. పూజాద్రవ్యములన్నియూ సమకూర్చబడెను. సమయానుకూలముగా పురోహితుడు పూజ ప్రారంభించెను. ధనికుడు, అతని భార్య పీటలమీద ఆసీనులైరి.

భగవంతునకు చేయవలసిన షోడశోపచారములతో ధూపము, దీపము పూర్తి అయినవి. తదుపరి నైవేద్యము తెప్పించబడెను. దానిని దేవుని పటము ముందు పళ్ళెరములోనుంచి నీటతో మంత్రోచ్చారణపూర్వకంగా సంప్రోక్షించి, 'ఓం ప్రాణాయ స్వాహా' అను మంత్రము చెప్పుచూ నైవేద్యమును దేవునకు అర్పించుటకై చేతిని పటమువైపు చూపుమని ధనికునితో చెప్పెను. కానీ ధనికుడు చేతిని తన పొట్టవైపు చూపించుచుండెను. "అట్లు చేయవద్దు అది అపచారము" అని పురోహితుడు చెప్పగా అంతట శ్రీమంతుడు "నైవేద్యము తినునది నేనేకదా, పటము తినదు కదా! అట్లు చూపినచో తప్పేమి?" అని అడిగెను.

"అప్పుడు పురోహితుడు తినువారు మీరే అయినను దేవునకు సమర్పించుచున్నట్లు భావనచేసి ఆ ప్రకారము దేవునకు చేయవలెను. భావన ప్రధానము" అని చెప్పగా ధనికుడు అట్లే చేసెను.       

శిల్పి ప్రకృతి

అనగా అనగా ఒక రాజ్యం, ఆ రాజ్యంలో ఒక రాజు, ఆ రాజు దగ్గర ఒక మంత్రి, ఆ మంత్రి ఒక రోజు వేటకి బయలుదేరినాడు ఆ మంత్రి వెళ్ళిన అడవిలోనే ఒక జలపాతం, సుందరమైన దృశ్యం, అత్యంత మనోహరమైన శబ్దం, పక్షుల రాగాలు, జలపాతం పై దోబూచులాడుకునే మేఘాలు, ఆ పైన వెలిగిపోతూ ఎంతో ఎంతో అందంగా ఉన్నాయి.

ఆ జలపాతం దగ్గరలో ఒక శిల్పాల వరుస! శిల్పి తదేక దీక్షతో ఓ ఏనుగు బొమ్మ చెక్కుతున్నాడు. దానికి ముందు ఓ హంస శిల్పం, ఆ పైన ఒక సుందరాంగి, ఆ పైన ఓ నాట్య గత్తె, ఆ పైన ఓ పుంగవుడు, ఆ పైన ఓ బాలుడు ఇలా రక రకాల శిల్పాలు ఉన్నాయక్కడ. కొద్ది రోజులుగా చెక్కుతున్న ఆ ఏనుగు బొమ్మకి కూడా ఆ రోజుతో చివరి ఉలి పోటు పెట్టి తృప్తిగా చూసుకొని కొద్దిగా దూరంగా వెళ్ళి తన శిల్పాలు అన్నీ చూసుకున్నాడు. మరో సారి తృప్తిగా తలాడించినాడు. ఇంతలో అటువైపు కొంతమంది అటవి జాతులు, యువతలు, యువకులూ, బాలలు వెళ్తూ ఇతనికి హల్లో చెప్పి ముందుకు వెళ్ళినారు. మరొక సారి తన సృష్టిని చూసుకొని నిట్టూర్చి "అద్భుతంగా ఉన్నాయని ఎవరైనా అంటారా?" అసలు నిజంగానే అద్భుతంగా ఉన్నాయా? లేక కాకి పిల్ల కాకికి ముద్దా? అని పెద్దగానే అన్నాడు. ఈ మాటలను అటువైపుగా వెళ్తున్న మంత్రిగారు విని వచ్చి చూసి, చూసి ఆశ్చర్యపోయి పెద్దగా, అసంకల్పితంగానే అనేసాడు. ?అద్భుతంగా ఉన్నాయి!? అని.

ఈ మాట వినగానే శిల్పి ముఖం వెలిగిపొయినది. తరువాత అన్నీ చక చకా జరిగిపొయినాయి. శిల్పి రాచనగరులో ఓ మూల శిల్పాలు చెక్కడం మొదలుపెట్టినాడు. అతని పనితనాన్ని చూసి వచ్చిన వారంత ముక్కున వేలేసుకోసాగినారు. అంత అద్భుతంగా చెక్క సాగినాడు. అతను చెక్కేవన్నీ దేనికదే సాటి అని అందరూ చెప్పుకోసాగినారు.

ఓ సుందరి, ఓ ఏనుగు, ఓ జింక, ఓ ఇంద్రుడు, ఓ విష్ణుమూర్తి, ఓ బ్రహ్మ, ఓ నారదుడు, ఓ కొలను, ఓ శిఖరం, ఓ గోపురం దేనికదే సాటిలా ఉన్నాయి.

ఓ రోజు మంత్రిగారు రాజును తోడ్కోని వీటిని అన్నీ చూపించడానికి వచ్చినాడు. శిల్పి నెమ్మదిగా అన్నిటినీ చూపించసాగినాడు. రాజుగారు ముందు సుందరాంగి బొమ్మ చూసినాడు, అద్భుతం అని ఆగిపొయినాడు ఇదేమిటి కళ్ళు చెక్కలేదు? ఇంకా పూర్తికాలేదు ప్రభూ అని తల వంచుకున్నాడు. తరువాత ఏనుగు బొమ్మ చూపించినాడు, చాల బాగుంది కానీ ఇంకా తొండం పూర్తి అయినట్టు లేదు అంటూ ముందుకు సాగినాడు. జింకకేమో కాలు పూర్తి కాలేదు, ఇంద్రునికేమో చేతులు పూర్తి కాలేదు, విష్ణుమూర్తికేమో కిరీటం పూర్తి కాలేదు, బ్రహ్మకేమో రెండే తలకాయలు ఇంకోటి? ఇలా అన్నీ చూస్తూ ముందుకు వెళ్ళినాడు.

శిల్పినేమో ఏమీ అనబుద్ది కాలేదు, ఎందుకంటే పూర్తి అయినంత వరకూ చాలా చాలా బాగా వచ్చినాయి. ఇలా చాలా సార్లు జరిగినది. రాజు గారు రావడం పూర్తికాని ఆ శిల్పాలు చూడటం అలాగే కొత్తగా చెక్కిన శిల్పాలు చూడటం మరళా పూర్తి కాలేదని నిట్టూర్చడం జరుగుతూనే ఉన్నది. ఒక రోజు మాత్రం రాజుగారి మూడ్ అస్సలు భాగోలేదు.

దానికి తోడూ ఇలా ఎప్పటికీ పూర్తికాని శిల్పాలు చూసి మరింత రెచ్చిపోయి సరిగ్గా వారం రోజులు సమయం ఇస్తున్నాను ఈ లోపులో పూర్తి కాకపొయినాయో నీకు మెడకాయ మీద తలకాయ ఉండదని బెదిరించాడు.

వారం రోజుల తరువాత రాజు గారు వచ్చి చూడ సాగినారు. సుందరి బొమ్మ కళ్ళు పూర్తి అయినాయి కానీ మెల్ల కన్ను, ఏనుగు తొడం పూర్తి అయినది కానీ నాలుగు వంకర్లు, జింక కాలు పూర్తి అయినది కానీ కుంటి కాలు!, ఇంద్రుడి చెయ్యి అవిటిది!, విష్ణు మూర్తి కిరీటం రివర్సు అయినది, బ్రహ్మ ముక్కు చప్పిడి ముక్కు అయినది.

రాజు కోపం నషాలాన్నంటినది, వెంటనే శిల్పికి కూడా మెల్ల కన్ను చేసి, కుంటి కాలు చేసి, అవిటి చేయి, ముక్కు పగల గొట్టి, తల బొప్పి కట్టించమని ఆజ్ఞాపించి వెళ్ళి పొయినాడు. శిల్పి కథ అంతటితో ముగిసేదేమో, కానీ మంత్రిగారు కొద్దిగా జాలి చూపించి రాజు గారి దగ్గర సెకండ్ చాన్సు పొంది శిల్పి దగ్గరకు వచ్చి మాట్లాడతాడు

ఏమిటయ్యా ఇది? అలా చేసినావు?

శిల్పి చేతులు నులుముకుంటున్నాడు కానీ ఏమీ మాట్లాడలేదు, ఆ ముఖంలో బాధ లేదు, సంతోషం లేదు. అడవిలో చక్కగానే చెక్కినావు కదా, ఇక్కడేమయినది? అయినా శిల్పం మొత్తం చక్కగా చెక్కి ఇదేమిటయ్యా ఇలా చివర్లో అంతా పాడు చేసినావు?

?అదేమిటో తెలీదు కానీ శిల్పం మొత్తం పూర్తి అవుతుంది కానీ ఈ రాచ నగరులో ఈ జనాల మధ్య ముగింపు మాత్రం నా వల్ల కావడంలేదు, మనసు లేకుండా ముగిస్తే ఇదిగో ఇలా పూర్తి అయినాయి." అయితే ఏమంటావు?

నేను అడవిలో, ఆ ప్రకృతి మధ్య బతక వలసిన వాడిని, ఇలా రాజుల కోసం, రాచ బిడ్డల కోసం చెక్కమంటే నా వల్ల కాదు. నా మనసు ఒప్పు కోవడంలేదు, నన్ను మరల పంపిస్తే అడవిలోకే పోతాను అని బతిమిలాడినాడు. ఇలా చాలా చాలా మాట్లాడుకున్నాక చివరకు ఎలాగో శిల్పి ప్రాణాలతో అడవిలోకి చేరినాడు. అడవిలో మరళా శిల్పాలు చెక్కసాగినాడు.

అందమైన రాజు బొమ్మ, రాచ నగరు బొమ్మ చెక్కి దూరంగా వెళ్ళి చూసుకోని ఇలా అనుకోసాగినాడు ?అద్భుతంగా ఉన్నాయని ఎవరన్నా అంటే భాగు? అర్థమయినదనుకుంటాను?.!       

శరభయ్య బద్దకం

ఒక ఊరిలో శరభయ్య అనే రైతు ఉండేవాడు. అతను చాలా బద్దకం. ఒక రోజు అతను ఎప్పటిలాగే ఎడ్లబండి నడుపుకుంటూ వెళ్తున్నడు. అది వర్షకాలం, ఆ ముందురోజే కుంభవృష్టి కురవడంతో రోడ్డంతా బురదగా, మడ్డిగా ఉంది. ఏదో పరధ్యానం లో ఉండి బండి తోలుతున్న శరభయ్యకు ఎవరో కుదిపేసినట్లు అనిపించడంతో బండి దిగి చూసాడు.

అతని బండి చక్రం ఒకటి బురదలో కూరుకుపోయింది. వెంటనే శరభయ్య దానిని భుజాలతో తీయడానికి ప్రయత్నించకుండా దేవుణ్ణి ప్రార్ధించడం మొదలుపెట్టాడు. దేవుడా నా బండి చక్రం బురదలో కూరుకుపోయింది. ఎలాగైనా నువ్వే కాపాడాలి అంటూ అరవడం ప్రారంభించాడు.

తన భుజాలను ఉపయోగించి బండి చక్రాన్ని సులువుగా పైకి తీయగలడు శరభయ్య. కానీ, ఏమాత్రం ప్రయత్నించకుండా దేవుడే రావాలి తన బండిచక్రం తీయాలి అని బీష్మించుకు కూర్చున్నాడు శరభయ్య. పది నిమిషాల తర్వాత వర్షం మొదలైంది. అంతే బండిచక్రం మరింతగా బురదలో కూరుకుపోయింది. ఆ రాత్రంతా బద్దకస్తుడైన శరభయ్య అలాగే వానలో తడుస్తూ కూర్చున్నాడు. కానీ, ఆ చక్రాన్ని పైకి తీయడానికి ఎంతమాత్రం ప్రయత్నించలేదు. మరుసటి రోజు ఉదయం ఇక మరోదారిలేక ఎలాగోలా చక్రాన్ని పైకి తీసి తన దారిలో తాను వెళ్ళిపోయాడు.