Pages

Tuesday, May 20, 2014

'నికొలస్' కథ.

చాలా కాలం క్రితం 'నికొలస్' అనే పిల్లవాడు ఊళ్ళో అందరికీ బాగా సాయం చేస్తూ ఉండేవాడట. పేదవాళ్లందరినీ పిలిచి, తన వాటా రొట్టెల్ని వాళ్లతో పంచుకొని తింటూ ఉండేవాడట. 'అట్లాంటి మంచి పిల్లవాడిని ఏం చెయ్యాలి?' అని ఆలోచించి, వాళ్ల అమ్మవాళ్ళు వాడిని చర్చిలో చేర్పించారు- 'కొంచెం భక్తి, కొంచెం శాస్త్రాలు, అన్నీ నేర్చుకుంటాడులే' అని.

నికోలస్ అన్నీ నేర్చుకున్నాడు. దాంతోపాటు ఏమయింది? -వాడి మంచితనం కూడా పెరిగింది. కష్టాల్లో ఉన్నవాళ్ళకు సాయం చేసే గుణం గట్టి పడింది. ఎవరు కనిపించినా వాళ్లకి సంతోషం కలిగేట్లు 'ఏవో చిన్న బహుమతులు ఇద్దాం' అనిపించసాగింది అతనికి.

'అరే, వీడు చిన్నవాడే, కానీ చాలా గట్టివాడు' అని చర్చివాళ్లు వాడికి పెద్ద ఉద్యోగం ఇచ్చారు. చిన్న వయసులోనే అతను కాస్తా 'బిషప్ నికొలస్' అయిపోయాడు. ఎర్ర అంగీ వేసుకొని, ఎర్ర కుచ్చు టోపీ పెట్టుకొని, గుర్రం మీద ఊరూరా తిరిగి, బిషప్ నికొలస్ కష్టాల్లో‌ ఉన్నవాళ్లకు ఏవేవో సాయాలు అందిస్తూ వచ్చాడు. జేబులో‌ చాక్లెట్లు, బిస్కెట్లు నింపుకొని, కనబడిన పిల్లాడికల్లా వాటిని పంచుతూ వచ్చాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ, పిల్లలు ఈ 'చిన్న బిషప్' చుట్టూ గుమిగూడేవాళ్ళు . అతను వాళ్లని ముద్దు చేసి, నవ్వి, నవ్వించి- సంతోష పెట్టేవాడు.

ఒక పని ఇంకో పనిని ఇస్తుంది- చిన్న నికొలస్ అలాగే బిషప్ నికొలస్ అయ్యాడు.

ఒకరోజున బిషప్ నికొలస్‌కి ఎవరో ఒక పేదవాడి గురించి చెప్పారు. ఆ పేదవాడికి ముగ్గురు కూతుళ్ళు. పేదరికం వల్ల అతను వాళ్లకు కడుపునిండా అన్నంకూడా పెట్టలేకుండా ఉన్నాడు. అందుకని, ఎవరు కొంటే వాళ్ళకు, వాళ్లని అమ్మేద్దామనుకుంటున్నాడట, అతను!

అది విని నికొలస్‌కి చాలా బాధ వేసింది. 'పిల్లల్ని అమ్ముకోవడం ఏంటి, నేను వీళ్లకు ఏమైనాసాయం చేస్తాను' అని, ఆరోజు రాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో- మెల్లగా- ఆ పేదవాడి గుడిసె మీదికి ఎక్కాడు నికొలస్... గుడిసె పై కప్పుకు ఓ పొగ గొట్టం ఉంది... నికొలస్ తను తీసుకొచ్చిన బంగారు నాణాల సంచీలు మూడింటిని, ఒకదాని వెనుక ఒకటిగా ఆ పొగగొట్టంలోంచి క్రిందికి వదిలేసి, చప్పుడు చెయ్యకుండా చూరుదిగి వెళ్లిపోయాడు.

అది చలికాలం. ఆ రోజుల్లో అక్కడి ఆడపిల్లలు సాక్సులు(మేజోళ్ళు) లేకుండా బయట తిరిగేవాళ్లు కాదు. మరి, ఈ పేదవాడి కూతుర్లు ముగ్గురికీ తలా ఒక్క జత మేజోళ్లే ఉన్నాయి. వాళ్ళు వాటిని రోజూ రాత్రిపూట ఉతుక్కునేవాళ్లు. ఉతికాక, 'ఉదయంలోగా ఆరాలి కదా' అని వాటిని పొయ్యి మీద వ్రేలాడదీసుకునేవాళ్ళు.

ఆరోజున కూడా వాళ్ళు అదే పని చేశారు: మేజోళ్ళని పొయ్యి మీద వ్రేలాడదీసుకున్నారు. అలా నికొలస్ వదిలిన బంగారపు మూటలు నేరుగా ఆ మేజోళ్లలో వచ్చి పడ్డాయి!

తెల్లవారగానే మేజోళ్లకోసం వచ్చిన పిల్లలు ముగ్గురికీ బంగారపు మూటలు దొరికాయి. వాళ్ల కష్టాలన్నీ తీరిపోయాయి. ఇంకేముంది, ఈ వార్త ఊరూరా ప్రాకింది. రాత్రి అవ్వగానే అందరూ తమ మేజోళ్ళను తెచ్చి పొయ్యి మీద వ్రేలాడదీసుకోవటం మొదలుపెట్టారు. "ఏదో‌ మ్యాజిక్ జరుగుతుందట. మేజోళ్లలోకి ఏవేవో బహుమతులు వచ్చి పడతాయట!" అని అందరూ చెప్పుకోవటం మొదలు పెట్టారు.

ఇట్లా‌ పిల్లలు ఆశ్చర్యపోవటం , ఆశ్చర్యపోవటం కోసం ఎదురుచూడటం- రెండూ బిషప్ నికొలస్‌కి చాలా నచ్చాయి. ఇక అప్పటినుండీ ఆయన రాత్రిపూట తిరగటం, పిల్లలకి తెలీకుండా‌ ఆశ్చర్యం గొలిపేటట్లు బహుమతులిస్తుండటం మొదలు పెట్టేశాడు.

పని పనిని ఇస్తుంది, నిజంగానే. చూస్తూండగానే బిషప్ నికొలస్ పెద్దాయన అయిపోయాడు.

బిషప్ నికొలస్‌కి ఆ తర్వాత ఎంత పేరు వచ్చిందంటే, ఆయన్ని చర్చి వాళ్ళు 'సెయింట్ నికొలస్' (నికొలస్ మహాత్ముడు) అనేశారు.

సంతోషానికి, ప్రేమ-ఆప్యాయతలకు మారు పేరు 'సంట్ కొలస్' అని దేశ దేశాల్లోనూ ప్రజలు చెప్పుకోవటం మొదలెట్టారు. అట్లా, చిన్న నికొలస్ కాస్తా మెల్లిగా సంట్‌కలస్ అయిపోయి, చివరికి 'సాంతాక్లస్' అయిపోయాడు!

క్రిస్మస్ రోజున పిల్లలందరికీ కోరుకున్న బహుమతులిచ్చి సంతోష పెట్టేది ఆ 'సాంతా'నే! అయితే ఇప్పుడు ఆయన ఇచ్చే బహుమతులకోసం పొయ్యిలమీద మేజోళ్ళుకూడా వ్రేలాడదీయనవసరం లేదు. పనుల్ని ఇష్టంగా చేస్తూపోతుంటే చాలు! పనిని వెతుక్కుంటూ‌ పని - ఆ పనికి బహుమతిగా మరో పని- ఇట్లా వరసపెట్టి వస్తూనే ఉంటాయి.

అపూర్వ స్నేహం

అనగనగా ఒక ఊళ్లో ఓ ఏనుగు ఉండేది. ఆ ఏనుగు ఉన్నచోటనే బక్కచిక్కిన కుక్క ఒకటి ఉండేది. ఏనుగుకు తెలియకుండా చడీచప్పుడు కాకుండా డేరాలోకి వచ్చి ఏనుగు తినేటప్పుడు పడిపోయిన ఆహారపదార్ధాలను ఆ కుక్క తింటుండేది. ఆ ఏనుగు కుక్క రాకపోకలు గమనించింది. తరచూ అలా వస్తూపోతుండటంతో కుక్కతో ఏనుగుకు క్రమేపీ స్నేహం కుదిరింది. 

ఆ ఏనుగు, కుక్క మంచి స్నేహితులయ్యయి. ఒకరు లేకుండా మరొకరు తినేవారు కాదు. రెండూ ఎంతో ఆనందంగా, ఆటలతో గడిపేవి. 

ఒకరోజు ఓ గ్రామస్తుడు నగరానికి వచ్చి, ఈ ఏనుగు డేరావైపు వచ్చాడు. అతను ఎవరూ గమనించకుండా కుక్కను తన గ్రామానికి తీసుకెళ్లాడు. 

తన స్నేహితుడు లేకపోయేసరికి ఏనుగుకు దిగులు పట్టుకుంది. ఏమీ చేయబుద్ది కావడం లేదు. తినడానికి, స్నానం చేయడానికి మనస్కరించడం లేదు. మాలి ఈ సంగతిని రాజుకు తెలిపాడు. 

రాజు దగ్గరున్న మంత్రికి జంతువులను అర్ధం చెసుకునే తెలివితేటలు ఉన్నాయి. మంత్రిని పిలిచి ఆ ఏనుగు పరిస్ధితి కంక్కోమని చెప్పాడు రాజు. ఆ మంత్రి ఏనుగు డేరా దగ్గరికి వెళ్లాడు. ఏనుగు చాలా దిగులుగా ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. అక్కడే వున్న సేవకులను పిలిచి, "ఏనుగుతో ఎవరైనా స్నేహంగా ఉండడం మీలో ఎవరైనా గమనించారా?" అని అడిగాడు మంత్రి. 

వెంటనే వాళ్లు కుక్కతో ఏనుగు స్నేహంగా ఉండేదని, అవి రెండూ మంచి మిత్రులని చెప్పారు. "ఆ కుక్కను ఎవరో తీసుకెళ్ల్లారు" అని చెప్పారు. 

మంత్రి రాజు దగ్గరికి వచ్చి, జరిగిన విషయం మొత్తం వివరించి చెప్పాడు. "రాజా్, మీ ఏనుగుతో స్నేహం కట్టిన ఆ కుక్కను ఎవరు బంధించి ఉంచారో వారికి జరిమానా వేస్తానని ఓ ప్రకటన చేయండి" అని సూచించాడు. 

రాజు ప్రకటన జారీచేశాడు. కుక్కను తీసుకెళ్లిన ఆ గ్రామస్తుడు ఆ ప్రకటన తెలుసుకుని కుక్కను వదిలేశాడు. అది పరుగు పరుగున ఏనుగు డేరాను చేరింది. 

ఏనుగు ఆనందానికి అంతేలేదు. తన స్నేహితుడిని తొండంతో పట్టి లేపి తన తలపై కూర్చోబెట్టి ఆడించింది. తోకను ఆడిస్తూ కుక్క కూడా ఎంతో ఆనందంతో ఆడుకుంది. అప్పట్నుంచీ ఆ రెండూ సంతోషంగా కలిసే ఉన్నాయి.

నీతి : సహజశత్రువులైనా ఎంతో మంచి మిత్రులు కావడానికి అవకాశం ఉంది.

మంచి మిత్రుడు (పావురం - ఎలుక)

పూర్వం గోదావరి నదీ తీరంలో ఓ పెద్ద బూరుగు చెట్టు ఉండేది. ఆకాశమును తాకుచున్నదా అన్నంత ఎత్తుగా విశాలంగా పరుచుకున్న కొమ్మలతో కళకళలాడుతూ ఉండే ఆ చెట్టు మీద ఎన్నో రకాల పక్షులు గూళ్ళు కట్టుకుని జీవిస్తున్నాయి. ఒకరోజు ఉదయం ఆ చెట్టు మీద నివసిస్తున్న 'లఘుపతనక' అనే కాకి నిద్రలేస్తూనే కిందకు చూచింది. ఆ చెట్టుకు కొద్ది దూరంలో ఒక వేటగాడు నూకలు చల్లి వలపన్నుతూ కనిపించగానే దానికి భయం వేసింది. 

'అయ్యో! పొద్దున్నే నిద్రలేస్తూనే ఈ పాపాత్ముడి మొహం చూసాను. ఈ రోజు నాకు ఏ ఆపద రానున్నదో...' అనుకుంటూ ఆ చెట్టు మీద నుండి రివ్వున ఎగిరిపోయి కొద్ది దూరంలో ఉన్న మరొక చెట్టుపైన వాలి ఆ వేటగాడిని గమనించసాగింది. వల పన్నటం పూర్తిచేసిన వేటగాడు ఆక్కడికి దగ్గరలోనే ఉన్న ఓ పొదలో దాక్కుని వలలో పక్షులు ఎప్పుడు చిక్కుకుంటాయా అని ఎదురుచూస్తున్నాడు. 

ఆకాశంలో ఆ చెట్టు వైపుగా ఓ పావురాల గుంపు ఎగురుకుంటూ రాసాగాయి. ఆ పావురాల గుంపుకు 'చిత్రగ్రీవుడు' అనే పావురం రాజు. ఆ బూరుగు చెట్టు దగ్గరకు వస్తూనే ఆకాశంలోంచి నేలమీద వేటగాడు చల్లిన నూకలను గమనించిన చిత్రగ్రీవుడు మిగిలిన పావురములతో 'మిత్రులారా! మనుషులు తిరగని ఈ చోటులో నూకలు ఉన్నాయి కనుక వీటి వెనుక ఏదో మర్మము ఉండి ఉంటుంది. బహుశా ఏ వేటగాడో మనలాంటి పక్షులకోసం పన్నిన వల అయి ఉండవచ్చు. అందుకని మనం ఈ నూకల కోసం ఆశపడి ఆపదను కొనితెచ్చుకోవద్దు' అంటూ హెచ్చరించాడు. 

ఆ గుంపులో ఉన్నా ఓ ముసలిపావురం చిత్రగ్రీవుడి మాటలకు నవ్వి 'చిత్రగ్రీవా! నీవు రాజువి అన్న అహంకారం వదిలి నేను చెప్పే మాటలను శాంతంగా విను. అనవసరమైన అనుమానాలతో ఎదుట ఉన్న ఆహారమును కాలదన్నుకొనుట మూర్ఖత్వము. నువ్వే చెప్పావుగా ఈ ప్రదేశములో మనుషులు తిరగరని. మరి ఇలాంటి చోట నూకలు ఉండటం అనుమానించతగ్గ విషయం ఏ మాత్రం కాదు. ఆ బూరుగు చెట్టుమీద నివసించే పక్షులు ఆహారం తెచ్చుకున్నప్పుడు ఆ నూకలు వాటి నుంచి జారిపడి ఉంటాయి. అందుచేత అవితినటానికి మనం క్రిందకు దిగుదాం!' అంటూ చిత్రగ్రీవుడి హెచ్చరికకు అభ్యంతరం చెప్పింది. 

ఆ ముసలి పావురం మాటలకు మిగిలిన పావురములు వంత పాడుతున్నట్లుగా ఉండటంతో చిత్రగ్రీవుడు తన మాటలతో ఆ పావురముల మనసు మార్చుట కష్టమని గ్రహించి మౌనంగా ఉండిపోయాడు. చిత్రగ్రీవుడి మౌనం అర్ధాంగీకారంగా భావించిన పావురములన్ని నూకలను తినటానికి నేలమీద వాలి వేటగాడు పన్నిన వలలో చిక్కుకుపోయాయి. 

చిత్రగ్రీవుడి మాట వినకుండా ముసలిపావురం మాట విని నూకలకు ఆశపడి ప్రాణాలు మీదకు తెచ్చుకున్నందుకు ఏడుస్తూ ముసలి పావురాన్ని మిగిలిన పావురాలన్నీ కోపంతో తిట్టసాగాయి. చిత్రగ్రీవుడు ఆ పావురాలన్నింటినీ ఓదారిస్తూ 'మిత్రులారా! వివేకవంతుడు కూడా ఒక్కొక్క సారి ఆవేశంవల్ల, దురాశ వల్ల ప్రాణాల మీదకి తెచ్చుకుంటాడు. ఇప్పుడు మనలో మనం గొడవపడితే మంచిదికాదు' అన్నాడు. చిత్రగ్రీవుడి మాటలకు మిగిలిన పావురాలన్ని శాంతించాయి. వలకు కొద్ది దూరంలో ఉన్న పొదలో దాక్కున్న వేటగాడు వలలో చిక్కుకున్న పావురములను చూసి 'ఆహ! పొద్దున్నే ఎవరి మొహం చూసానోగానీ... ఈ రోజు నా పంట పండింది' అనుకుంటూ పొదలోంచి లేచి వలవైపు రాసాగాడు. 

వేటగాడిని చిత్రగ్రీవుడు గమనించి 'మిత్రులారా! వేటగాడు వస్తున్నాడు. మనమందరం ఒక్కసారి బలంగా ఆకాశంలోకి ఎగురుదాం అప్పుడు వలతో సహా వేటగాడికి దొరకకుండా ఈ ఆపదను తప్పించుకుంటాం. ఆ తరువాత గండకీ నది ఒడ్డున ఉన్న అడవిలో హిరణ్యకుడు అనే ఎలుక ఉన్నది అతను నాకు మంచి మిత్రుడు, అతని దగ్గరకు వెడదాం ఈ వలను కొరికి మనల్ని రక్షిస్తాడు' అని మిగిలిన పావురములతో చెప్పాడు. చిత్రగ్రీవుడి ఉపాయానికి మిగిలిన పావురాలన్నీ సంతోషించాయి. వేటగాడికి దొరకకుండా తప్పించుకునే మార్గం దొరికినందుకు వాటికి కొత్త ఉత్సాహం పుట్టుకొచ్చింది. పావురాలన్నీ ఒక్కసారిగా రెక్కలను టపటపాలాడించాయి. రివ్వుమంటూ వలతో సహా ఆకాశంలోకి వేగంగా ఎగిరిపోయాయి. 

వలలో చిక్కుకుని గింజుకుంటున్న పావురాలు ఎక్కడకి పోతాయిలే అని తాపీగా వస్తున్న వేటగాడు ఒక్కసారిగా పావురములన్ని ఆకాశంలోకి ఎగరిపోవటం చూసి కొయ్య బారి పోయాడి. వెంటనే తెలివితెచ్చుకుని ఆకాశంలో పావురాలు ఎగురుతున్న దిక్కువైపు నేలమీద పరుగుపెట్టి కొంత దూరం వెళ్ళి ఆయాసంతో ఆగిపోయి ఇక ముందుకు వెళ్ళలేక తన దురదృష్టానికి ఏడుస్తూ ఇంటి దారి పట్టాడు. పావురములన్ని ఎక్కడా ఆగకుండా ఎగురుతూ విచిత్రవనంలో హిరణ్యకుడు నివశిస్తున్న చెట్టు దగ్గర వాలాయి. పావురముల రెక్కల శబ్ధమునకు భయపడిన హిరణ్యకుడు చెట్టుతొర్రలోపలికి దూరిపోయి భయంతో కూర్చున్నాడు. అప్పుడు చిత్రగ్రీవుడు 'మిత్రమా! నేను చిత్రగ్రీవుడిని' అని చెప్పగానే హిరణ్యకుడు వేగంగా బయటకు వచ్చి చిత్రగ్రీవుడిని చూసి ఆనందపడి ఆ తరువాత చిత్రగ్రీవుడితో పాటు మిగిలిన పావురాలన్ని కూడా వేటగాడు పన్నిన వలలో చిక్కుకున్నాయని తెలుసుకుని బాధ పడ్డాడు. 

చిత్రగ్రీవుడు హిరణ్యకుడిని చూసి ఆనందపడి 'మిత్రమా! స్నేహితుడు ఆపదలో ఉన్నపుడు బాధపడేవాడే నిజమైన మిత్రుడు. అందుకే నేను నీ దగ్గరకు వచ్చాను. ఈ వలతాళ్ళను కొరికి మమ్మల్ని రక్షించు' అన్నాడు. చిత్రగ్రీవుడు మాటలకు హిరణ్యకుడు ఆనందిస్తూ 'మిత్రమా! నీ కోరిక తప్పక మన్నిస్తాను. కాకపోతే నా పళ్ళు చాలా సున్నితమైనవి కనుక ముందు నీ కాళ్ళకున్న తాళ్ళను కొరుకుతాను' అన్నాడు. హిరణ్యకుడి మాటలకు చిత్రగ్రీవుడు నవ్వి... ' అలాగే కానివ్వు మిత్రమా! కాకపోతే ముందుగా ఈ పావురములకున్న తాళ్ళను కొరికి ఆ తరువాత నా కాళ్ళకున్న తాళ్ళను కొరుకు' అన్నాడు. 

'చిత్రగ్రీవా! తనకు మాలిన ధర్మము మొదలు చెడ్డబేరము' అన్నాడు హిరణ్యకుడు. 'హిరణ్యకా... మనలని నమ్మిన వారిని రక్షించుట మన ధర్మం. అదే న్యాయం, అందుకే ముందు ఈ పావురాలని రక్షించి ఆ తరువాత నన్ను రక్షించు. 'చిత్రగ్రీవుడి మాటలకు నిజమును గ్రహించిన హిరణ్యకుడు తన పళ్ళతో అన్ని పావురముల బంధములను కొరికి వాటిని రక్షించెను. 

చూసారా! ప్రతివారికీ అపద సమయంలో ఆదుకొనుటకు ఓ మంచి మిత్రుడు ఉండాలి. 'మిత్రలాభము కంటే మించిన లాభము లేదు' అన్నది ఈ కధలోని నీతి. నాలుగు రూపాయలను వెనకేసుకోవటం కంటే నలుగురు మిత్రులను సంపాయించుకున్నవాడే నిజమైన ధనవంతుడు, గుణవంతుడు అని చెప్పటం కూడా ఈ కధలోని ఉద్దేశం.

మోసపోయిన మోసగాడు

రామశింగవరం అనే గ్రామంలో సోమయ్య అనే చిన్న రైతు ఉండేవాడు. ఎంతో కష్టించి పనిచేసి ఒక ఎకరం పొలం, ఒక చిన్న ఇల్లు సంపాదించగలిగాడు. అతని వద్ద కొన్ని కోళ్ళు, ఒక కుక్క కూడా ఉన్నాయి. సోమయ్యకు ఇద్దరు కొడుకులు. పెద్దవాడి పేరు రాజయ్య. రెండవ వాడి పేరు అంజయ్య. సోమయ్యకు వృద్ధాప్యం వచ్చింది. తరచు సుస్తీగా ఉండేవాడు. ఒకరోజు ఇద్దరు కొడుకులనూ పిలిచి తన ఆస్తిని వారిరువురూ చెరి సమానంగా పంచుకోమని చెప్పాడు. "మీరిద్దరూ కలిసి మెలిసి ఉండండి. పొలంలో ఎవరి వాటాను వారు వ్యవసాయం చేసుకోండి. మీలో మీకు గొడవలు వస్తే మీ మధ్య మూడవ మనిషి ప్రవేశించి తాను లాభం పొందుతాడు" అని సోమయ్య వాళ్ళకు సలహా చెప్పాడు. మరి కొద్ది రోజులకు అతను చనిపోయాడు. సోమయ్య ఇద్దరు కొడుకుల్లో రాజయ్య తెలివైనవాడు. అతను దుర్మార్గుడు కూడా. తమ్ముడి మంచితనాన్నీ, తెలివితక్కువతనాన్నీ, చూసి అతణ్ని మోసగించడానికి రాజయ్య నిర్ణయించుకున్నాడు. తమ ఇంట్లో వున్న వస్తువుల్లో సగం వస్తువులను తమ్ముడికి జాగ్రత్తగా పంచి ఇచ్చాడు. కోళ్ళను పంచవలసివచ్చినప్పుడు మాత్రం అతను తన తెలివితేటలను ఉపయోగించాడు! "తమ్ముడూ! ఈ కోళ్ళను పెంచడానికి చాలా శ్రమ పడవలసి వస్తుంది. 

నువ్వు చిన్నవాడివి. ఇందులో నీకు అనుభవం లేదు. వీటిని పెంచి నువ్వు అవస్థలు పడలేవు. అందువల్ల నీకు శ్రమ తగ్గించడం కోసం ఈ కోళ్ళను నేనే తీసుకొని, ఆ కష్టమేదో నేనే పడతాను" అన్నాడు. మంచివాడైన అంజయ్య తన అన్నగారి మాట కాదనలేక అందుకు అంగీకరించాడు. "తమ్ముడూ! కోళ్ళను నాకిచ్చావు కాబట్టి కుక్కను నువ్వు తీసుకో!" అన్నాడు రాజయ్య. అంజయ్య కుక్కను, రాజయ్య కోళ్ళను పెంచసాగారు. కొన్నాళ్ళు గడిచాయి. తన వాటాకు వచ్చిన కోళ్ళ వల్ల రాజయ్య లాభం పొందసాగాడు. గుడ్లను పట్నానికి తీసుకు వెళ్ళి అమ్మి అతను డబ్బు సంపాదిస్తున్నాడు. అంజయ్య ఎటువంటి ఆదాయం రాక అవస్థలు పడసాగాడు. అతనికి కుక్క అదనపు భారమైంది. దానికి రోజూ అతను తిండి పెట్టవలసి వస్తోంది. వాడు విచారంగా ఉండేవాడు. ఒకరోజున అంజయ్యకు మెరుపు మెరిసినట్టు ఒక ఆలోచన తోచింది. కుక్క వల్ల తాను అంతో ఇంతో లాభం పొందాలనుకొన్నాడు. కొంతకాలం పాటు దానికి వేటాడ్డంలో తర్ఫీదును ఇచ్చాడు. 

ఒకనాడు కుక్కతో పాటు అడవిలోకి వెళ్ళాడు. అంజయ్య, కుక్క కలిసి చాలా శ్రమపడి చివరికి ఒక లేడిని చంపారు. లేడి మాంసాన్ని పట్నానికి తీసుకు వెళ్ళి అంజయ్య అమ్మాడు. అందువల్ల అతనికి కొంత డబ్బు వచ్చింది. అతనిలో ఎంతో ఉత్సాహం కలిగింది. అతను రోజూ కుక్కను తీసుకొని అడవికి వెళ్ళసాగాడు. ఆ కుక్క నేర్పుగా అంజయ్యతో పాటు కుందేళ్ళను, చిన్న జంతువులను వేటాడసాగింది. వాటిని పట్నంలో అమ్మి అంజయ్య డబ్బు సంపాదించసాగాడు. తమ్ముడు డబ్బును సంపాదించి సుఖంగా ఉండడం చూసిన రాజయ్యలో అసూయ కలిగింది. ఎలాగైనా ఆ కుక్కను చంపేయాలని అలోచించాడు. అందుకు తగిన అదును కోసం అతను ఎదురు చూడసాగాడు. ఒకరోజు సాయంత్రం అంజయ్య పట్నానికి వెళ్ళాడు పనిమీద. రాజయ్య కొంత అన్నాన్ని కూరతో కలిపి, దాంట్లో విషాన్ని జల్లాడు. ఆ అన్నాన్ని కుక్క ముందు పెట్టి పొలంలోకి వెళ్ళాడు. కుక్క కొద్దిగా అన్నం తిన్నది. అయితే అన్నంలోంచి వస్తున్న ఏదో వాసన దానికి సహించలేదు. 

అందుచేత ఆ అన్నాన్ని అది తినడం మాని, అన్నం మెతుకుల్ని కాళ్ళతో అటూ ఇటూ జిమ్మేసింది. తాను తిన్న అన్నాన్ని కూడా కక్కేసింది. రాజయ్య కోళ్ళు అటూ ఇటూ తిరుగుతూ కుక్క జిమ్మిన అన్నం మెతుకుల్ని పూర్తిగా తినేశాయి! అన్నంతో పాటు వాటి పొట్టల్లోకి విషం కూడా వెళ్ళిపోయింది. తర్వాత అవి తమ గూళ్ళలోకి వెళ్ళిపోయాయి. తెల్లవారింది. రాజయ్య నిద్రలేచాడు. అప్పటికి తాను పెట్టిన విషంతో కుక్క చచ్చిపడి వుంటుందని అతను భావించాడు. కుక్క శవం కోసం ఇంటి చుట్టుప్రక్కల వెతకసాగాడు. అయితే హఠాత్తుగా అతనికి తమ్ముడు అంజయ్య, కుక్క యధాప్రకారం అడవికి వెళ్తూ కనిపించారు. అతను అశ్చర్యపోయాడు కుక్క బతికుండడం చూసి. తర్వాత రాజయ్య కోళ్ళగూళ్ళ వద్దకు వేళ్ళాడు. కోళ్ళ గూళ్ళ ముందు కొన్ని లోపల కొన్ని కోళ్ళు చచ్చిపడి ఉండడం చూసి రాజయ్యకు మతిపోయింది. అతనికి చాలా ఏడుపు వచ్చింది. తాను కుక్కను చంపడానికి, దానికి పెట్టిన విషం నిండిన అన్నాన్ని తన కోళ్ళు తిని చనిపోయాయని రాజయ్య గ్రహించాడు. తాను తీసిన గోతిలో తానే పడినందుకు అతను కృంగిపోయాడు. అయితే అంజయ్య మాత్రం అన్నను ఓదార్చాడు. ఆ తరువాత రాజయ్య తన స్వార్థ బుద్ది మార్చుకొని అంజయ్యతో ప్రేమగా ఉండసాగాడు.

ఊరికోసం బావి

వేసవి సెలవులు వచ్చాయి. రాము పదవ తరగతి పరీక్షలు రాశాడు. రామూ నాన్నగారికి పల్లెలో ఉద్యోగం. అందుచేత అందరూ ఆ పల్లెలోనే ఉంటున్నారు. తెలంగాణాలోని ఒక చోటు వారికి వాన నీరే ఆధారం. నీరు తెచ్చుకోవడానికి రెండు మైళ్ళు పోవాలి. అక్కడ ఒక చెరువు ఉంది. ఆ నీరు తెచ్చుకుని వాడుకోవాలి. బిందె అయిదు రూపాయలకు నీరు కొనుక్కోవాలి. ఈ బాధలన్నీ కళ్ళారా చూస్తున్నాడు రాము. ఏదైనా చేయాలి? అనుకున్నాడు. రామూ మామయ్య ఇంజనీరు. ఆయన పట్నంలో ఉంటాడు. శెలవులకు మామయ్య దగ్గరకు వెళ్ళాడు. తమ ఊరి సమస్య చెప్పాడు. రామూ మామయ్య బాగా ఆలోచించాడు. ఒక ఉపాయం చెప్పాడు. రామూ సంతోషంగా తిరిగి వచ్చాడు. ఊరివారు అందరికీ మంచినీరు కావాలి. ఓపిక ఉన్నవారు రెండు మైళ్ళు వెళ్ళి తెచ్చుకుంటారు. డబ్బులు ఉన్నవాళ్ళు నీరు కొనుక్కుంటారు. మరి ఓపిక, డబ్బూ లేని వారు ఏం చేయాలి? దాహంతో చావవలసిందేనా! రామూ స్నేహితులు అందరినీ ఈ ప్రశ్న కలచివేసింది. వారు కూడా ఏదైనా చేయాలి అనుకున్నారు. సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నారు. వారం శ్రమ పడితే ఊరి ఇబ్బంది తీరుతుంది. రామూ మామయ్య చెప్పినది స్నేహితులతో చెప్పాడు రాము. 

ఊరికి మధ్యలో చింతల తోపు ఉంది. అక్కడ బావి తవ్వితే నీరు పడుతుంది. ఇది ఇంజనీరు మామయ్య చెప్పిన మాట. అయితే బావి ఎవరు తవ్వుతారు? పెద్ద బావి తవ్వడానికి బోలేడు డబ్బు కావాలి. అంత డబ్బు ఎవరు ఇస్తారు? రాము, స్నేహితులు ప్రతి ఇంటికి వెళ్ళారు. ఊరి సమస్య అందరికీ తెలిసినదే! సహాయం అడిగారు. డబ్బు రూపంగా ఇవ్వవచ్చు. శ్రమదానం చేయవచ్చు. ఎవరు ఎలా అయినా బావి తవ్వకానికి సహాయపడాలి. పిల్లలను చూసి పెద్దవాళ్ళకు ఊపు వచ్చింది. ఊరివారు అందరూ ఒక చోట చేరారు. ఈ సమస్యకు జవాబు చెప్పాలని అనుకున్నారు. అందరూ చందాల రూపంలో డబ్బు పోగు చేశారు. డబ్బు ఇవ్వలేని వారు పలుగు - పార చేతబట్టారు. బావి తవ్వడానికి ముహూర్తం పెట్టారు. అందరూ ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చారు. పంతులుగారు కొబ్బరి కాయ కొట్టారు. బావితవ్వడం పనులు మొదలు అయ్యాయి. పెద్దవాళ్ళు పలుగు పారలతో తవ్వుతున్నారు. రాము, రాము స్నేహితులు తట్టలతో మట్టిమోశారు. అందరూ పాటలు పాడుతూ పని చేస్తున్నారు. ఆడవారు పని చేసేవారికి అన్నీ అందిస్తున్నారు. అందరికీ పులిహార పొట్లాలు, పెరుగు అన్నం యిచ్చారు. అందరూ మధ్యాహ్నానికి ఇంత ఎంగిలి పడ్డారు. బీద గొప్ప తేడాలేదు. కులం మతం పట్టింపు లేదు. అందరూ చేయి చేయి కలిపారు. బావి తవ్వకం జోరుగా సాగుతోంది. రాము ఎంతో సంతోషించాడు. పట్నం నుండి ఇంజనీరు మామయ్య వచ్చాడు. ఎన్ని అడుగులు తవ్వితే నీరు పడుతుందో చెప్పాడు. మూడు రోజులలో బావి తవ్వకం పూర్తి అయింది. జలజలమంటూ నీటి ఊట ఉబికి వచ్చింది. 

ఊరివారి ఆనందానికి హద్దులు లేవు. ఎగిరి గంతులు వేస్తూ పండుగ చేసుకున్నారు. బావి నీరు కొబ్బరి నీరులాగా తియ్యగా ఉంది. బీడు నేలలో తియ్యని నీరు పడటం అబ్బురం! చకచకా బావి చుట్టూ రాతి గోడలు కట్టారు. మరి వారం రోజులలో పనులూ పూర్తి అయ్యాయి. పంచాయితీ ప్రెసిడెంటుగారు వచ్చారు. బావిని ఊరికి అంకితం చేశారు. ఆయన బావి తవ్వకం కథ విన్నారు. రామూని, అతని స్నేహితులనూ అభినందించారు. ఊరికి ఉపకారం ఇంత చిన్న పిల్లలు చేశారు. బావి తవ్వకంలో పది మంది పిల్లలు పని చేశారు. వాళ్ళకి ఈ సంవత్సరం ఖర్చు అంతా పంచాయితీ భరిస్తుంది. వాళ్ళ చదువు, బట్టలూ అన్నీ పంచాయితీ చూస్తుంది. ఆ విధంగా ప్రెసిడెంటుగారు హామీయిచ్చారు. అందరూ ఆనందంగా చప్పట్లు కొట్టారు.

పిశాచాలు చేసిన సహాయము

అనగనగా అవంతీపురం సమీపములో గల గ్రామములో ఒక ముసలి అవ్వ, మనుమడు ఉన్నారు. అవ్వ అమాయకురాలు. ఇరుగు పొరుగు అవ్వకి మాయమాటలు చెప్పి ఉప్పు, పప్పు తీసుకువెళ్ళేవారు. అవ్వను సుఖపెడదామంటే అవ్వచేసే పనికి మనుమడికి కోపం వచ్చేది. పై పెచ్చు గుట్టుగా సంసారము చేయాలని తెలియదు అనేది. ఒక రోజున అవ్వ ఇల్లు ఊడుస్తూ ఉంటే చిన్న తాళము చెవి దొరికింది. అది తన మనుమడి పెట్టెదని తీసి పెట్టె తాళము తీసి పెట్టెలోపల డబ్బు చూసి అందరిని పిలిచి చెప్పింది. ఆ మాటలు చాటుగా ఉన్న దొంగలు విని హడావుడిగా వచ్చి మీ మనుమడు చెట్టు మీదనుంచి పడిపోయాడు. దెబ్బలు తగిలాయి. డబ్బు తీసుకొని రమ్మన్నాడని చెపితే తీసుకొని వాళ్లమాటలు నిజమేనని నమ్మి ఆ డబ్బులు ఇచ్చింది అవ్వ. ఆధనము తీసుకొని వాళ్ళు పారిపోయారు. అవ్వ ఏడుస్తూ గుమ్మంలో చతికిలపడింది. 

కొంతసేపు గడిచేసరికి మనుమడు సరుకులు తీసుకొని వచ్చాడు. అప్పుడే దెబ్బలు తగ్గిపోయాయా? అని అవ్వ అడిగేసరికి అవ్వ చెప్పిన మాటలు వల్ల అంతా తెలిసి నా కష్టార్జితము మట్టి పాలు చేశావు గదే! ఇంకా కాస్త కూడబెట్టి పట్టణంలో వ్యాపారము చేద్దామనుకున్నాను. నాకు ఆ రాత లేదే. మళ్ళీ నా కంటికి కనిపించకు, వెళ్ళిపో అని అన్నము తినకుండా వెళ్ళిపోయాడు. మనుమడి మాటలకు అవ్వకు పట్టరాని దుఃఖము కలిగి అడవిలోకి వెళ్ళి పిశాచాల బారిన పడి మరణించాలని బయలుదేరి వెళ్ళి చింతచెట్టు దగ్గర కూర్చొని పిశాచాలు పిశాచాలు రండి అంటూ అరిచింది. రెండు తెల్లని పిశాచాలు వచ్చి మమ్మల్ని ఎందుకు పిలిచావు అంటూ అడిగాయి. అవ్వ వాటిని చూసి భయపడక విషయమంతా చెప్పి నా మనుమడిచే అంత మాటలు అనిపించుకున్నాక ఎందుకు బ్రతకాలి నన్ను చంపేయండి అంది. 

పిశాచాలు కూడబలుక్కొని అది కుర్రదొంగలపని అని గ్రహించి అవ్వా నీ మనుమడి ధనము నీ చేతికి తిరిగి వస్తే ఇంటికి వెళతావా? లేక చచ్చిపోతావా? అని అడిగాయి. ధనము దొరికితే ఇంటికి వెళ్తానంటే సరే మా వెంటరా అని కుర్రదొంగల వద్దకు తీసుకువెళ్ళి బయట ఉండమని చెప్పాయి. లోపల అందమయిన అమ్మాయిని వాళ్ళిద్దరూ ఏడిపించటం గమనించి ఆ అమ్మాయిలో ప్రవేశించి నేను పిశాచాల పెద్దమ్మ పెంపుడు కూతుర్ని. మీ సంగతి చెప్తా అంటూ ఇద్దర్నీ చావబాదింది. దాంతో వాళ్ళిద్దరూ పారిపోవడానికి ప్రయత్నించగా రెండో దయ్యము పిశాచము ఆవహించి వున్న దయ్యం కాళ్ళ దగ్గర పడేసింది. దాంతో హడలెత్తిన దొంగలతో అవ్వను మోసం చేసి ధనము తీసుకున్నది మీరేనా అని అనగా మేమే అంటూ ఆ ధనమును అక్కడ పడేసి పారిపోయారు. వాళ్ళు వెళ్ళగానే అవ్వ లోపలికి వచ్చింది. అవ్వా! నీ డబ్బు తీసుకో. అని ఈ అమ్మాయి మంచిది. సవతి తల్లి బాధలు పడలేక వచ్చి వీరి బారిన పడింది. నీ మనుమడికి ఇచ్చి వివాహం చేసి సుఖంగా ఉండు అని చెప్పి అదృశ్యమయ్యాయి. 

అవ్వ ధనముతో పాటు అందగత్తెలాంటి అమ్మాయిని తీసుకురావడం చూసిన మనుమడు అవ్వా ఎవరు ఈమె అన్నాడు. నీ భార్య నీ ధనము ఇదుగోరా అంటూ జరిగిన విషయము చెప్పింది. మంచి ముహూర్తం చూసి వారి వివాహం జరిపించింది. వారు సుఖంగా జీవనంసాగిస్తున్నారు.

స్నేహబలం

హిరణ్యకుడు అను ఎలుక, చిత్రాంగుడు అనే జింక, మంథరుడు అనే తాబేలు, లఘుపతకము అనే కాకి వీళ్ళు నలుగురు మిత్రులు. కర్పూర గౌరవము అనే చెరువులో తాబేలు ఉండేది. ఆ చెరువులో ఒడ్డున ఉన్న చెట్టు తొర్రలో ఎలుక, ఆ చెట్టు మీద కాకి ఉండేది. ఆ ప్రక్కనే ఉన్న పొదలో జింక ఉండేది. 

సాయంత్రపు పూట ఈ నలుగురు మిత్రులు ఒకేచోట చేరి సరదాగా కబుర్లు చెప్పుకొంటూ ఆనందంగా జీవిస్తూ ఉండేవారు. ఒక రోజు మథ్యాహ్నమనగా ఆహారం కోసం వెళ్ళిన జింక సాయంత్రం అవుతున్నా తిరిగి రాకపోవటంతో తాబేలు, ఎలుక, కాకి కంగారు పడ్డాయి. చాలా సేపు ఎదురుచూసినా జింక వస్తున్న జాడ కనిపించలేదు. 

'స్నేహితులారా! చిత్రాంగుడు ఇంతసేపయినా ఇంటికి తిరిగి రాలేదంటే ఏదో ప్రమాదంలో చిక్కుకొని ఉంటాడు అంది తాబేలు కంగారుగా. 'అవును నిజమే!' అన్నాయి ఎలుక, కాకి. 'ఇప్పుడు ఏం చేద్దాం!' అనుకున్నాయి ఆ మూడు. స్నేహితులారా! నేను ఎగిరివెళ్ళి అడవంతా చూసివస్తాను' అంటూ కాకి రివ్వుమంటూ ఆకాశంలోకి ఎగిరింది. 

తాబేలు, ఎలుక చిత్రాంగుడు వస్తాడేమోనని నాలుగు దిక్కులు చూస్తూ నిల్చున్నారు. ఆకాశంలో ఎగురుతున్న కాకికి ఒకచోట జింక కనిపించిది. కాని అది వేటగాడు పన్నిన వలలో చిక్కికుపొయి బాధతో గింజుకుంటోంది. కాకి జింక ముందు వాలింది. కాకిని చూసి జింక ఆనందంతో 'వచ్చావా! లఘుపతనకము ఆహారం కోసం వచ్చి చూసుకోకుండా వేటగాడు పన్నిన వలలో చిక్కుకుపోయాను నన్ను రక్షించవా' అంది. 'భయపడకు చిత్రాంగా! నేను మన ఎలుక మిత్రుడు హిరణ్యకుడిని తీసుకువస్తాను అతను ఈ వలను కొరికి నిన్ను రక్షిస్తాడు!' అని కాకి జింకకు ధైర్యం చెప్పి మళ్ళీ ఆకాశంలోకి వేగంగా ఎగిరి వెళ్ళి కొద్దిసేపట్లోనే ఎలుకను తన వీపు మీద ఎక్కించుకొని వచ్చి జింక దగ్గర వాలింది. 

ఎలుక తన పదునైన పళ్ళతో వల కొరికి జింకను విడిపించింది. ఆ ముగ్గురు ఆనందంగా కబుర్లు చెప్పుకొంటూ తమ ఇళ్ళ వైపు నడిచారు. దారిలో వాళ్ళకి తాబేలు ఎదురుపడింది. అయ్యో! మంధరా నువ్వెందుకు వచ్చావు అనడిగాడు హిరణ్యకుడు. 'చిత్రాంగుడు ఆపదలో ఉన్నాడని తెలిసి ప్రశాతంగా కూర్చోలేకపోయాను. 

మీరిద్దరూ చిత్రాంగుడిని రక్షిస్తారని నాకు తెలుసు. అయినా మనసు ఊరుకోలేదు. అందుకే వచ్చాను అంటూ సమాధానమిచ్చాడు మంథరుడు. 'నువ్వు నిజమైన స్నేహితుడివీ అంటూ చిత్రాంగుడు ఆనందంగా మంథరుడిని ముద్దు పెట్టుకున్నాడు. ఆ నలుగురూ అనందంగా కబుర్లు చెప్పుకొంటూ ఇంటి దారి పట్టారు. కొంతదూరం ఆ నలుగురు నడిచే సరికి వేటగాడు ఎదురుపడ్డాడు. వాడిని చూడగానే జింక పొదలోకి దూరిపోయింది. కాకి ప్రక్కనే ఉన్న చెట్టు మీదకి ఎగిరిపోయింది, ఎలుక ప్రక్కనే ఉన్నకలుగులోకి దూరిపోయింది. తాబేలు మాత్రం ఎటూ పారిపోలేక వేటగాడి చేతికి దొరికిపోయింది. 

జింక తప్పించుకున్నా తాబేలు దొరికిందని ఆనందపడ్డ వేటగాడు తాబేలును బాణం కొసకి తాడుతో కట్టి భుజం మీద వేసుకొని ఇంటి దారిపట్టాడు. వేటగాడు కొంతదూరం వెళ్ళగానే జింక, ఎలుక, కాకి ఒక్కచోట చేరి 'అయ్యో! చిత్రాంగుడు వేటగాడి బారి నుంచి తప్పించుకున్నాడంటే మళ్ళీ మంథరుడు వీడి చేతికి దొరికాడే' అనుకుని బాధపడ్డాయి. 

అప్పుడు హిరణ్యకుడు 'స్నేహితులారా! మన మంథరుడిని రక్షించుకుంటానికి నాకు ఒక మంచి ఉపాయం తట్టింది అంది. 'హిరణ్యకా! తొందరగా ఆ ఉపాయం చెప్పు అంది కాకి. 'వేటగాడు నడిచే దారిలో చిత్రాంగుడు చచ్చినట్లు పడి ఉంటాడు. అప్పుడు వేటగాడు పట్టుకుంటానికి మంథరుడిని కట్టిన బాణం క్రింద పెట్టి వెళతాడు. అప్పుడు ఆ తాడును నేను కొరికి మంథరుడిని తప్పిస్తాను' అని చెప్పింది. 

ఆ ఉపాయం ఎలుకకి, కాకికి నచ్చింది. ఆ మూడు అడ్డదారిలో వేటగాడి కంటే ముందుకి పోయి ఒక చోట జింక దారికి అడ్డంగా పడుకొంది. కాకి దాని మీద వాలి ముక్కుతో పొడుస్తున్నట్లు నటించసాగింది. ఆ దారిలో నెమ్మదిగా వస్తున్న వేటగాడు జింకను చూసాడు. దాని మీద వాలి కాకి ముక్కుతో పొడవటం వల్ల అది చచ్చిపోయిందనుకొని 'ఆహా! ఏమి నా భాగ్యం. ఈ రోజు అదృష్టం నా పక్షాన ఉంది అందుకే వలలో జింక తప్పించుకున్నా ఇక్కడ మరొక జింక దిరికింది అని ఆనందపడుతూ భుజం మీద బరువుగా ఉన్న తాబేలును నేల మీద పెట్టి జింక దగ్గరకు నడిచాడు. 

వెంటనే ఎలుక వచ్చి తాబేలుకి కట్టిన తాడును కొరికేసింది. కాకి 'కావ్! కావ్'మని అరుస్తూ ఆకాశంలోకి ఎగిరిపోయింది. జింక పారిపోయింది. వేటగాడు కొయ్యబారి పోయి అంతలోనే తేరుకుని తాబేలు కోసం చూసాడు. అప్పటికే తాబేలు ప్రక్కనే ఉన్న చెరువులోకి పారిపోయింది. 

'ఆహా! ఏమి నా దురదృష్టం చేతిలో వున్న దానిని వొదులుకున్నాను అనుకొంటూ ఆ వేటగాడు ఇంటికి వెళ్ళిపోయాడు. 

ఎలుక, జింక, తాబేలు, కాకి ఆనందంగా తమ ఇంటికి వెళ్ళిపోయాయి. చూసారా! స్నేహం అంటే ఈ నాలుగు ఉన్నట్లు ఉండాలి. ఆపదలో ఉన్న స్నేహితుడిని ఆదుకుంటానికి అవసరమైతే ప్రాణాలను కూడా ఫణంగా పెట్టగలగాలి. పనికిరాని స్నేహితులు పదిమంది ఉండే కంటే అవసరంలో ఆదుకొనే స్నేహితుడు ఒక్కడుంటే చాలు. స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం.

రామలింగడి రాజభక్తి

శ్రీకృష్ణదేవరాయలకు తన మంత్రి తెనాలి రామలింగడి తెలివి, చతురతను పరీక్షించాలని ఎప్పుడు కోరికగా ఉండేది. ఒకసారి రామలింగడి తెలివిని మెచ్చి రాజు ఒక గంప నిండా బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చాడు. బంగారు నాణేలు గంప నిండా ఉండటంతో ఏమాత్రం కుదుపు వచ్చినా గంపలోని పైనున్న నాణేలు కిందపడతాయి. పైగా ఆ గంప చాలా బరువుగా ఉంది. 

ఎవ్వరూ ఆ గంపను మోయలేరు. దాంతో మిగిలిన సభికులు రాజుగారు రామలింగడిని తెలివిగా ఇరికించారని సంతోషించారు. రామలింగడు ఆ గంపను లేపడానికి ప్రయత్నించగా అది కనీసం కదలనైనా లేదు. కొద్ది సేపు ఆలోచించిన రామలింగడు తన తలపాగాను తీసి నేలపై చాపలాగా పరిచి అందులో కొన్ని నాణేలను పోసి మూట కట్టాడు. కొన్ని నాణేలను తన జేబుల్లో నింపుకుని, మూటను వీపు మీద వేసుకుని, వెలితి పడిన గంపను నెత్తిన పెట్టుకుని నడవడం మొదలుపెట్టాడు. 

రామలింగడు సమయస్పూర్తికి ఆశ్చర్యపోయిన రాజు "శభాష్ రామలింగా! శభాష్!" అంటూ మెచ్చుకోసాగాడు. రాజుగారి వైపు తిరిగిన రామలింగడు వినయంగా తలవంచి నమస్కరించిగానే అతని జేబుల్లోని నాణాలు బరువుకు నేలమీద పడిపోయాయి. వాటి చప్పుడు సభంతా మార్మోగింది. అంతే సభంతా నవ్వులతో నిండిపోయింది. రామలింగడి తొందరపాటుకు అంతా నవ్వసాగారు. దాంతో గంపను, ముటను కిందపెట్టి రామలింగడు ఆ జారి పడిపోయిన నాణేల కోసం సభంతా వెతకసాగాడు. పడుతూ, లేస్తూ ఏరుకోవడం చూస్తున్న సభికులకు ఎంతో తమాషాగా అనిపించింది. అందరు తలోమాట అన్నారు. 

"ఎంత దురాశపరుడు" అన్నాడు ఆస్ధాన పూజారి. "గంపెడు నాణేలున్నా కిందపడిన రెండు మూడు నాణేల కోసం వెతుకుతున్నాడు" అన్నాడు సేనాధిపతి. "అదిగో ఆ స్తంభం వెనకాల ఒకటి, రాజు గారి సింహాసనం పక్కన ఒకటి" అనుకుంటూ సభంతా పరిగెత్తుతూ కింద పడిన నాణేలను ఏరసాగాడు రామలింగడు. ఈ దృశ్యం చూసిన ఒక మంత్రి రాయలవారి దగ్గర కొచ్చి ఆయన చెవిలో "ఇలాంటి సిగ్గుమాలిన వ్యక్తిని నేనింతవరకూ చూడలేదు" అంటూ రామలింగడిని ధూషించసాగాడు. 

రామలింగడు నాణేలన్నీ ఏరిన తర్వాత రాజు "రామలింగా! నీకు గంపెడు నాణేలను ఇచ్చాను కదా! మరి ఎందుకింత దురాశ, కిందపడిన కొన్ని నాణేల కోసం వెతికావు? అన్నారు. "రాజా! ఇది దురాశ కాదు, కిందపడిన నాణేలపై కూడా మీ బొమ్మ మీ పేరు రాసి ఉంది కదా! ఇలా అందరూ నడిచే చోటపడి, ఎవరైనా తొక్కితే అది నేను సహించలేను. కాబట్టే నేను అంత అదుర్దాగా వాటిని ఏరి వేశాను" అని చెప్పడంతో సభంతా మూగబోయింది. 

రాయలవారు ఆనందంతో సింహాసనం దిగివచ్చి రామలింగడిని కౌగిలించుకున్నారు. అతనికి మరో గంపెడు బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చాడు.

మంచి స్నేహితుడెవరు?

చాలాకాలం క్రిందట మంచితెలివితేటలు, వివేకం ఉన్నఒకరాజు ఉండేవాడు. అతడి పేరుప్రతిష్టలు ఇతరరాజ్యాల వరకు పాకిపోయినవి. అనేక కళలలో ఆరితేరిన కళాకారులు అతని మెప్పును, పారితోషికంపొందేదుకూతడి దర్బారుకు విచ్చేసేవారు. అందులో కొందరు తమతెలివితేటలను ప్రదర్శించి రాజు వివేకాన్ని పరీక్షించడానికి కూడా దయచేసేవారు. ఒకరోజు ఒక కళాకారుడు రాజుదర్బారుకు వచ్చాడు. తాను తయారుచేసిన మూడుబొమ్మలనుకూడా అతను తనతో కూడా తీసుకొచ్చాడు. వ్యత్యాసం లేకుండా ఒకేలా ఉండే ఆమూడు బొమ్మలనూ రాజు ముందు ఉంచుతూ "రాజా ఈ మూడుబొమ్మలనూ, , జాగ్రత్తగా పరిశీలించి ఏది అందమైనబొమ్మో, ఏది వికారమైనబొమ్మో, ఏది అందంగా కాక, వికారంగాకాక ఉన్నదో పరిశిలించి చెప్పండి." అని ప్రార్ధించాడు. కళాకారుడు మాటలు విన్న రాజు ఆమూడు బొమ్మలనూ చేత్తో పట్టుకొని పరిశీలించాడు. ఆమూడుబొమ్మలూ ఒకేలా ఎత్తుగా ఉంటూ బరువులోకూడా సమంగా ఉండటం, అన్నింటిపోలికలూ ఒకేలాఉండటం రాజు గమనించాడు.
ఆ మూడుబొమ్మల్లో ఎల్లాంటివ్యత్యాసాన్ని అతడు. ఆమూడుబొమ్మలనూ జాగ్రత్తగా గమనిస్తున్నప్పుడు ఒకబొమ్మ రెండుచెవులలో రంధ్రమున్న సంగతిని గుర్తించాడు. ఒకసూదిని రంధ్రాలున్న బొమ్మ చెవిలొ ఒకవైపు ఉంచి ఆ బొమ్మను కదిలించాడు. సూది మరోచెవిలో సునాయాసంగా బయటకు వచ్చినది. మరొబొమ్మచెవిలో మరియూ నోటిలో రంధ్రముండటాన్ని రాజు గమనించాడు. వెంటనే రాజు సూదిని చెవిలో దూర్చాడుదూరచినసూది నోటిగుండా బయటకు వచ్చినది. మూడవబొమ్మకు ఒక్కచెవిలో తప్ప మరెక్కడా రంధ్రాన్ని రాజు చేడలేకపోయడు ఆచెవిలో దూర్చిన సూది బయటకు రాకుండా లోపలే ఉండటాన్ని రాజు గమనించాడు. తానుచేసిన తెలుసుకొనిన చేసిన పనులను గురించి రాజు గంభీరంగా ఆలోచించాడు. కాసేపైన తరువాత ఆ కళాకారుణ్ణి ఉద్దేశించి "మీరు చాలాతెలివిగలిగిన కళాకారులు" అని అభినందించాడు. ఆ తరువాత పరిపూర్ణమైన వివేకాన్ని మీరు ఈమూడు బొమ్మలద్వారా జనాలకు బోధించడం నిజంగా నాకు ఆనందాన్ని ఇస్తుంది. మీ ఈ మూడుబొమ్మల మూడురకాల మిత్రులను గురించి చెబుతున్నాను. మనకష్టాలను సహనుభూతితో వింటూ, మనరహస్యాలను కాపాడుతూ, మనకు సహాయం చేయగల నిజమైన స్నేహితుడను మనము ఆశించాలి.
ఇందులో మొదటి బొమ్మ మనకున్న చెడ్డస్నేహితుడను గురించి చెబుతుంది. మీరు మీకష్టాలను, బాధలను వినిపిస్తే అతడు అన్నింటిని వింటున్నాట్టూ అభినయిస్తాడు. కానీ అతడు నిజంగా వినడు. అతడు ఏఒక్కరికీ ఎలాంటి సహాయం చేయడు. చెవిద్వారా విన్నది మరో చెవిద్వారా వదిలి వేస్తాడు. రెండవరకం స్నేహితుడికి ఈ రెండవరకం బొమ్మ ప్రతినిధిత్వం వహిస్తుంది. మీరహస్యాలను అతనితో చెప్పినప్పుడు సానుభూతితో వింటాడు. కాని ఇతడు చాలా ప్రమాదకరమైనవ్యక్తి మీరహస్యాలను ఇతడు బట్టబయలు చేస్తాడు. ఇతడుతనలో మనరహస్యాలను దాచడు. ఈ మూడవబొమ్మే చాలా ఉత్తమమైనది. ఈ బొమ్మ ఒక ఉత్తమ స్నేహితుడికి ప్రతిరూపం. మీరు చెప్పేమాటలను అతడు చాలా ఓపికతో శ్రధతో వింటాడనీ మీరునమ్మకంగా నమ్మవచ్చును. మీరహస్యాలను అతడు తనలో భధ్రంగా తనలో దాచుకుంటాడు. ఎంత కష్టమైనా సరే అతడు ఆ రహస్యాలను బట్టబయలు చేయడు. ఇటువంటి మిత్రుడి సన్నిధిలో మీరు సురక్షితంగా ఉండగలరు. రాజుగారి మాటలు, విశదీకరణ ఆ కళాకారుడికి బాగానచ్చినాయి. అతడు రాజు వివేకాన్ని, తెలివితేటలను పొగిడాడు.
నీతి: మీస్నేహితుల రహస్యాలను బయటపెట్టకండి.